పాల్వంచ రూరల్, మార్చి 26 : కిన్నెరసాని, కాచనపల్లి క్రీడా పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కొరకు కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో మంగళవారం విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహించారు. 9 క్రీడాంశాల్లో ఈ నెల 5, 6వ తేదీల్లో బ్యాటరీ టెస్టులు నిర్వహించి అర్హత సాధించిన వారిని ఎంపిక చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రతిభ చూపిన బాలబాలికలకు చివరిగా బ్యాటరీ టెస్ట్ నిర్వహించి.. పాల్వంచ మండలం కిన్నెరసానిలో 40 మంది బాలురు, గుండాల మండలం కాచనపల్లిలో 40 మంది బాలికలను ఎంపిక చేస్తారు. అయితే మంగళ, బుధవారాల్లో క్రీడా పోటీలు నిర్వహించి ఆయా క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచిన వారిని 5వ తరగతిలో ప్రవేశానికి అర్హత కల్పిస్తారు. మంగళవారం ఉమ్మడి జిల్లా నుంచి 100 మంది బాలబాలికలు హాజరుకాగా.. వారికి పోటీలు నిర్వహించారు. స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాల్రావు ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటనారాయణ, నాగేశ్వరరావు, అన్నం వెంకటేశ్వర్లు, బుగ్గా వెంకటేశ్వర్లు, హెచ్ఎం చందు పాల్గొన్నారు.