ఖమ్మం ఎడ్యుకేషన్, అక్టోబర్ 30 : విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగోన్నతులు, ఉన్నత చదువులు అవసరమైన వారికి ఓపెన్ స్కూల్ విద్య ఓ వరంగా మారింది. సార్వత్రిక విద్యా విధానంపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ విధానంలో చదువుకునేందుకు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో అధ్యయన కేంద్రాలు నిర్వహిస్తున్నారు. చదవడం, రాయడం తెలిసి 14 సంవత్సరాలు నిండిన వారందరికీ దూరవిద్య విధానంలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇందుకు ఖమ్మం జిల్లాలో పదో తరగతి, ఇంటర్కు 24 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదో తరగతి, ఇంటర్కు 30 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి.
ప్రవేశాలు పొందాలంటే…
ఓపెన్ స్కూల్ విద్యలో పదో తరగతిలో ప్రవేశం పొందేందుకు 2022 ఆగస్టు నాటికి 14 సంవత్సరాలు, ఇంటర్లో ప్రవేశం పొందేందుకు 15 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రవేశాలకు గరిష్ఠ పరిమితి లేదు. ఇంటర్లో చేరేందుకు పది ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుతో పాటు వయస్సు ధ్రువీకరణ పత్రం అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యాసకులు ఆయా కేటగిరీలకు సంబంధించిన పత్రాలను జత చేయాలి. ఈ ధ్రువపత్రాలు రెగ్యులర్గా ఉత్తీర్ణులైన వారికి ఇచ్చే వాటితో సమానం. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు సైతం అర్హత కల్పిస్తున్నది. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తయినప్పటికీ మళ్లీ అవకాశం కల్పిస్తూ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
బోధన…
ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్లో బోధన విషయాలను మూడు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ఏ-భాషలు, బీ-భాషేతర విషయాలు, గ్రూప్-సీలో వృత్తి విద్య కోర్సులు ఉన్నాయి. గ్రూప్-ఏ, బీల నుంచి కనీసం రెండు సబ్జెక్ట్ల చొప్పున మొత్తం ఐదు సబ్జెక్ట్లు ఎంపిక చేసుకోవాలి. ఇంటర్ గ్రూప్-ఏలో భాషలు, గ్రూప్-బీలో ఆప్షనల్స్, గ్రూప్-సీలో విద్యాకోర్సులు ఉంటాయి. గ్రూప్-ఏ నుంచి ఇంగ్లిష్తోపాటు నచ్చిన బాషను ఎంపిక చేసుకోవాలి. గ్రూప్-సీలో తమకు నచ్చిన వృత్తి విద్య కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్లు పొందిన అభ్యర్థులందరికీ ఉచితంగా పుస్తకాలు అందిస్తారు. వారికి ప్రతి ఆదివారం, రెండో శనివారాలు తరగతులు నిర్వహిస్తారు. సులభ పద్ధతిలో ఇచ్చిన పుస్తకాలను ఇంటి వద్ద చదువుకొని రావాలి. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు తరగతులు నిర్వహిస్తారు. అభ్యాసకుల సందేహాలను అధ్యాపకులు తీరుస్తారు. కేంద్రంలో 200 వరకు అభ్యాసకులు పరీక్షలు రాసే వారుంటే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేలా బోర్డు సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు. అభ్యాసకులు తప్పనిసరిగా 24 తరగతులకు హాజరుకావాలి.
రుసుముల వివరాలు..
పదో తరగతి జనరల్ కేటగిరీకి సంబంధించి పురుషుల ప్రవేశ రుసుం రూ.1400కి దరఖాస్తు రుసుం రూ.150తోపాటు ఆలస్య రుసుం రూ.100 కలిపి మొత్తం రూ.1650 చెల్లించాలి. అన్ని కేటగిరీలకు సంబంధించిన మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగుల కేటగిరీల పురుషులకు రూ.1150తోపాటు ఆలస్యం రుసుం రూ.100 కలిపి మొత్తం రూ.1200 చెల్లించాలి. ఇంటర్ జనరల్ కేటగిరీకి చెందిన వారైతే పురుషులు రూ.1500లకు రూ.300 దరఖాస్తు రుసుంతోపాటు స్పెషల్ డ్రైవ్లో ఆలస్య రుసుం రూ.200 కలిపి మొత్తం రూ.2000 చెల్లించాలి. ఇతర కేటగిరీలకు చెందిన వారైతే రూ.1200లకు దరఖాస్తు రుసుం రూ.300, స్పెషల్ డ్రైవ్ రుసుం రూ.200 కలిపి మొత్తం రూ.1700 చెల్లించాలి. ఫీజులను ఆన్లైన్లో చెల్లించాలి. ప్రవేశాలను అపరాధ రుసుముతో నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు చెల్లించవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి
రెగ్యులర్గా చదువుకోలేని, పేద విద్యార్థులకు ఓపెన్ స్కూల్ మంచి అవకాశం. చదువుకోవాలని ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరూ ఓపెన్ స్కూల్స్ను సద్వినియోగం చేసుకోవాలి. రెగ్యులర్ విద్యతో సమానంగా గుర్తింపు ఉన్నందున అభ్యాసకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఓపెన్ స్కూల్ ద్వారా చదువు గొప్ప వరం.
– ఎస్.యాదయ్య, డీఈవో
భవిష్యత్కు బాటలు
ఓపెన్ స్కూల్లో ప్రవేశాలు పొందిన వారికి భవిష్యత్పై అవగాహన కల్పిస్తున్నాం. ఉచితంగా పుస్తకాలు అందజేస్తున్నాం. ఓపెన్ స్కూల్ ద్వారా చదివి ఎందరో మంచి ఉద్యోగాలు పొందారు. స్పెషల్ డ్రైవ్లో ప్రవేశాలు పెంచేందుకు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నాం. పదో తరగతి, ఇంటర్ కోర్సులో కనీస ఫీజుతోనే ప్రవేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నది.
– మద్దినేని పాపారావు, రెండు జిల్లాల కో-ఆర్డినేటర్