ఖమ్మం, జనవరి 7: రేషన్కార్డుదారులు ఈ -కేవైసీ చేయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ నుంచి కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు రేషన్ డీలర్ వద్ద మాత్రమే ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. గతేడాది సెప్టెంబర్లో ప్రక్రియ ప్రారంభం కాగా కేంద్రం డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. ప్రక్రియ పూర్తి చేసుకోని వారి కోసం కేంద్రం ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించింది. ఖమ్మం జిల్లాకు చెందిన రేషన్కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పౌర సరఫరాలశాఖ అధికారులు సూచిస్తున్నారు.
రేషన్ కార్డులో పేరు ఉన్న వ్యక్తులు ప్రతిఒక్కరూ రేషన్ దుకాణానికి వచ్చి డీలర్ వద్దనున్న ఈ పాస్ మెషన్లో ఈ-కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ-కేవైసీ పూర్తయితే పారదర్శకంగా రేషన్ పంపిణీ ఉంటుందని కొందరు అభిప్రాయపడుతుంటే, మరోవైపు ఈ ప్రక్రియ ద్వారా కేంద్రం భారీ మొత్తంలో రేషన్ కార్డులు ఎత్తివేసే కుట్ర చేస్తున్నదని పలువురు పేర్కొంటున్నారు. బతుకు దెరువు కోసం, ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు వ్యయప్రయాసాలతో ఈ-కేవైసీ కోసం సొంత గ్రామాలకు రావాల్సి వస్తున్నదంటున్నారు.
జిల్లావ్యాప్తంగా 748 రేషన్ దుకాణాలు ఉండగా వీటి పరిధిలో 4,11,347 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఆయా రేషన్ కార్డుల్లో 11,32,871 మంది పేర్లు ఉండగా ఇప్పటివరకు కేవలం 7,90,161 మంది మాత్రమే ఈ-కేవైసీ చేయించుకున్నారు. అంటే 69.75శాతం మంది మాత్రమే ప్రక్రియ ఇంకా 3,42,710 మంది సభ్యులు ఈ-కేవైసీ చేయించుకోలేదు.
రేషన్కార్డుల్లో పేరు ఉండి ఆధార్ అప్డేషన్ చేసుకోనివారి ఈ కేవైసీలు నిలిచిపోతున్నాయి. వారంతా తిరిగి ఆధార్ కేంద్రాలకు వెళ్లి ఆధార్ అప్డేట్ చేయించుకునే పనిలో ఉండడంతో ఈకేవైసీ మరింత ఆలస్యమవుతున్నది. ఈ నెల 31లోపు రేషన్కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని, లేకపోతే రేషన్కు దూరమయ్యే పరిస్థితి ఉంది.
ఖమ్మం నగరానికి చెందిన సుబ్రహ్మణ్యం(పేరు మార్చాం)అనే వృద్ధుడికి చాలా ఏళ్ల నుంచి రేషన్కార్డు ఉంది. ఆయన కాలం చేసి నాలుగు సంవత్సరాలైంది. ఆయన చనిపోయినప్పటికీ అతడి కుటుంబం నెల నెలా రేషన్ బియ్యం తీసుకుంటున్నది. ఇలా రేషన్ బియ్యం దుర్వినియోగం అవుతూనే ఉన్నది.
రఘునాధనాపాలెం మండలంని బల్లేపల్లికి చెందిన ముస్తాఫా (పేరు మార్చాం) చనిపోయి ఎనిమిదేైళ్లెంది. ఆయన పేరుపై ప్రతి నెలా ఆయన కుటుంబ సభ్యులు రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. రేషన్ డీలర్ ఒక నెల బియ్యం ఇవ్వకపోతే ఆన్లైన్లో ఆహార భద్రత కార్డు ప్రింట్ తీసుకువచ్చి ‘మా నాన్నకు వచ్చిన కోటా బియ్యం ఎందుకు ఇవ్వడం లేదు..’ అని డీలర్ను ప్రశ్నిస్తున్నారు.
..ఇలా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత రేషన్ బియ్యం తీసుకుంటున్న కుటుంబాలు ఖమ్మం జిల్లావ్యాప్తంగా వేలాదిగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. మృతిచెందిన వారి కార్డులు, స్వగ్రామాల నుంచి మరో ఊరికి వెళ్లిపోయిన వారి పేర్లు, వివాహమై ఇతర గ్రామాలకు వెళ్లినవారి పేర్ల తొలగింపు ప్రక్రియ జరగలేదు. ఈ లోపాన్ని ఆసరా చేసుకుని ఎంతోమంది కుటుంబ సభ్యులు నెల నెలా రేషన్ పొందుతున్నారు. ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. బోగస్ రేషన్ కార్డులు ఏరివేయాలనే ఉద్దేశంతో ప్రక్రియను ప్రారంభించింది.