ఖమ్మం వ్యవసాయం/ ఖమ్మం రూరల్, ఏప్రిల్ 22: మరోసారి వరుణుడు ప్రతాపం చూపడంతో రైతులకు నష్టం వాటిల్లినట్లయింది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం వల్ల చేతికి వచ్చిన పంటలు నేలపాలయ్యాయి. కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న జిల్లా ప్రజలకు ఈ అకాల వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ యాసంగి పంటలకు మాత్రం నష్టం చేకూర్చింది. నెల రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు మధిర, వైరా నియోజకవర్గాల్లో పలు మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్న విషయం విదితమే. అప్పుడే సీఎం కేసీఆర్ వచ్చి క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలించి నష్ట పరిహారం ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో ఈ పరిహారం బాధిత రైతుల అకౌంట్లలో చేరే సమయంలో మరోసారి వరుణుడు విరుచుకపడ్డాడు. ఈ సారి పాలేరు నియోజకవర్గంలో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి.
శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఒక్కసారిగా భారీ వర్షంతోపాటు బలమైన గాలులు వీచాయి. దీంతో ఖమ్మం నగరంతోపాటు పలు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు గంటపాటు కురిసిన వర్షానికి చేతికి వచ్చిన పంటలు నేలకొరిగాయి. వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. మామిడి కాయలు కూడా నేలరాలాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ముదిగొండ మండలంలో 26.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం రూరల్ మండలంలో దెబ్బతిన్న పంటలను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పరిశీలించారు. తగిన న్యాయం చేస్తామంటూ రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు ఏవో నాగేశ్వరరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, రైతుబందు సమితి అధ్యక్షుడు అక్కినపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
రెండువేల ఎకరాలలో పంటనష్టం
శుక్రవారం అర్ధరాత్రి బలమైన గాలులతో కూడిన భారీ వర్షానికి ఉమ్మడి జిల్లాలు పలు పంటలు దెబ్బన్నాయి. ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాల్లో 1,516 మంది రైతులకు చెందిన 2,091 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటల్లినట్లు జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. మరో 220 ఎకరాల్లోని మామిడితోటల్లో కాయలు రాలిపోయినట్లు ఉద్యానశాఖ అధికారులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం వరకు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించిన అధికారులు సాయంత్రం తుది నివేదిక సిద్ధం చేశారు. అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.