ఖమ్మం, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్నేరు వరదల్లో జరిగిన ముంపు నష్టంపై సమగ్ర సర్వే చేపడుతున్నామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. దానితోపాటు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, ముంపునకు గురైన సాగుభూముల వివరాలు కూడా సేకరిస్తున్నామన్నారు. వీటిపై రెండు, మూడు రోజుల్లో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు చెప్పారు. మున్నేరు వరదల సహాయక చర్యలు, నష్టం అంచనా నేపథ్యంలో ఖమ్మం టీటీడీసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణపై దృష్టి సారించామని, మరమ్మతులకు నిధుల కోసం అంచనాలు రూపొందించేందుకు ఇప్పటికే ఆదేశించామని వివరించారు. మున్నేరు వరద ప్రవాహానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, ఖమ్మం రూరల్ మండలంలోని పరీవాహక గ్రామాలు నీట మునిగాయని అన్నారు. అయితే ఏ ప్రాంతంలో ఎంతమేరకు నష్టం జరిగిందో , ఇళ్లు, ఇళ్లలోని గృహోపకరణాలు ఏ మేరకు దెబ్బతిన్నాయో అనే అంశాలపై కేటగిరీల వారీగా సర్వే నిర్వహించి అంచనాలు రూపొందించినట్లు వివరించారు. ముంపునకు గురైన ప్రజలు నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడకుండా మంత్రి అజయ్ తన ట్రస్టు ద్వారా నిత్యావసర వస్తువుల కిట్లను అందించారని, వంట సామగ్రిని అందులో ఉంచారని అన్నారు. జిల్లా అధికారులు చొరవ తీసుకుని దాతలు, జిల్లా రైస్మిల్లర్ల సంఘం సహకారంతో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు చెప్పారు. మున్నేరు బాధితుల పునరావాస సహాయక చర్యల కోసం రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి అందించిన రూ.కోటి విరాళం కలెక్టర్ అకౌంట్కు చేరినందున వాటితో సహాయ, పునరావాస చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే మంత్రి అజయ్ చొరవతో భద్రాచలంలోని ఐటీసీ అధికారులు ఖమ్మం మున్నేరు బాధితులకు సహాయ చర్యల్లో తోడ్పాటునందించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కలెక్టర్ వివరించారు.