ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 9 : ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 98 కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. వీటిల్లో రెగ్యులర్ విద్యార్థుల కోసం 96 రెగ్యులర్ కేంద్రాలు, సప్లిమెంటరీ విద్యార్థుల కోసం రెండు ప్రైవేటు కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కలిపి మొత్తం 16,514 పరీక్షలు రాయనున్నారు. పరీక్షలకు సమయం సమీపిస్తున్నందున వాటి నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్ల ఎంపికకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే, ఇన్విజిలేటర్ల గుర్తింపు కోసం వారి వివరాలను జిల్లా అధికారులు సేకరిస్తున్నారు.
ఈ ఏడాది మార్చిలో జరుగనున్న పది పరీక్షల కేంద్రాలను కేటాయించేందుకు జీవో నెంబర్ 151/బీ-2 ద్వారా ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రాలను ఎంపిక చేయాలో అందులో స్పష్టంగా పేర్కొంది. కేంద్రాల ఎంపికకు పరిశీలించాల్సిన ప్రాధామ్యాలను స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలను పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా గుర్తించాలని స్పష్టం చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా జంబ్లింగ్ పద్ధతిలోనే కేంద్రాలను ఎంపిక చేస్తున్న తరుణంలో ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలకు ప్రథమ ప్రాధాన్యం కల్పించారు. పరీక్షలు జరిగే సమయంలో, నిర్వహణలో ఎలాంటి ఆటంకాలూ ఏర్పడకుండా ఉండడంతోపాటు ప్రశాంతమైన వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్రాలను ఎంపిక చేశారు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 96 కేంద్రాలను ఎంపిక చేయగా.. వీటిలో 77 ప్రభుత్వ, 19 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. నిరుడు 103 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించిన అధికారులు.. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పరీక్ష కేంద్రాలను కూడా కుదించారు.
జిల్లాలో టెన్త్ పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు జంబ్లింగ్ విధానంలో కేంద్రాలుగా కేటాయించనున్నారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలోని 423 పాఠశాలలను 44 జోన్లుగా విభజించారు. అలాగే, పరీక్షా కేంద్రాలను ఏ, బీ, సీ కేంద్రాలుగా విభజించారు. జిల్లా, మండల కేంద్రాల్లో ఉన్న స్కూళ్లను ‘ఏ’ సెంటర్లుగా గుర్తిస్తారు. పోలీస్ స్టేషన్కు ‘8’ కిలోమీటర్ల పరిధిలో ఉండే పరీక్ష కేంద్రాలను ‘బీ’ కేంద్రాలుగా గుర్తిస్తారు. పోలీస్ స్టేషన్కు ‘8’ కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంగా ఉండే కేంద్రాలను ‘సీ’ కేంద్రాలుగా గుర్తిస్తారు.
ఖమ్మం జిల్లాలో 282 ప్రభుత్వ పాఠశాలల్లోని 10,146 మంది విద్యార్థులు, 141 ప్రైవేట్ స్కూళ్లలోని 6,368 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఖమ్మం నగరంలో 100కిపైగా విద్యార్థులున్న స్కూళ్లు ప్రైవేట్లో ఎనిమిది, ప్రభుత్వంలో నాలుగు ఉన్నాయి. అత్యధికంగా న్యూవిజన్లో 487 మంది, శ్రీచైతన్యలో 446 మంది, త్రివేణిలో 216 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ఎస్పీ కెనాల్ పాఠశాల నుంచి 137 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
పరీక్షల నిర్వహణలో కీలకమైన చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ ఆఫీసర్ల (డీవో) ఎంపిక పూర్తయింది. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సీఎస్, ఒక డీవో ఉండనున్నారు. 98 మంది సీఎస్లను, 98 మంది డీవోలను ఎంపిక చేశారు. వీరితో కస్టోడియర్, జాయింట్ కస్టోడియన్ అధికారులను ఎంపిక చేశారు. వీరితోపాటు ఇన్విజిలేటర్ల ఎంపికకు సంబంధించి ప్రధానోపాధ్యాయుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్ పద్ధతిలో ఇన్విజిలేషన్ విధులు కేటాయించనున్నారు.