మామిళ్లగూడెం, జనవరి 30 : జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాల్లో అధికారులు ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు మార్గదర్శకాలు వచ్చాయా అని అధికారులను ఆరాతీశారు. సమావేశాలకు ఎప్పటిలాగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకాలేదు. వివిధశాఖల జిల్లా అధికారులు సైతం సమావేశాలకు రాలేదు.
దీంతో జడ్పీ చైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సమావేశాలకు హాజరుకాని అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లా ఆసుపత్రి బోధనాసుపత్రిగా ప్రభుత్వ వైద్య విద్య కళాశాలకు అనుసంధానం కావడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రి ఎకడ ఏర్పాటు చేస్తారని జడ్పీ చైర్మన్ కమల్రాజు ప్రశ్నించగా ఖమ్మం-వైరా మధ్యలో కనీసం 5 నుంచి 10 ఎకరాల స్థలం సమకూర్చితే ఆసుపత్రి నిర్మించేందుకు ప్రతిపాదనలున్నాయని డీసీహెచ్ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు వివరించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.