ఇల్లెందు రూరల్, మార్చి 22 : కొమరారం గ్రామంలో కొందరు రైతులు వేసిన వరి పంట ఎదుగుదల లేకపోవడం, 15 రోజులకే కంకి రావడంతో ఇటీవల రైతులు ఆందోళన చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రైతుల ఫిర్యాదు మేరకు కృషి విజ్ఞానం కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.శ్రీనివాస్, ఏడీఏ రవికుమార్లు శుక్రవారం భూక్యా వీరన్న, వాంకుడోత్ హచ్చు, వాంకుడోత్ శంకర్, బానోత్ బాలు తదితర రైతులు వేసిన వరి పంటలను పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు జెనెక్స్, ఆర్ఎన్ఆర్ 15048 విత్తనాలు వేశారని, అవన్నీ ధ్రువీకరణ లేని విత్తనాలని అన్నారు.
ఎకరానికి 10 కేజీల చొప్పున జనవరి మొదటి వారంలో నారు పోసి.. ఫిబ్రవరి మొదటి వారంలో నాటు వేశారని తెలిపారు. మొక్క ఎత్తు, పిలకల సంఖ్య, కంకి పొడవును సేకరించడంతోపాటు ఎన్ని కిలోల విత్తనాలు వేశారు? ఏయే పురుగు మందులు వాడారు? అనే వివరాలను నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ వాసవీరాణి, ఏవో సతీశ్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.