పాల్వంచ, ఏప్రిల్ 1 : ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా హాస్టళ్లలో ఉండి చదువుతున్న విద్యార్థులకు సమయానికి మెనూ ప్రకారం పౌష్ఠికాహారం అందించాలని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం పాల్వంచలోని కిన్నెరసాని బాలుర ఆశ్రమ పాఠశాలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ట్రైనీ కలెక్టర్ యువరాజ్ మర్మాడ్తో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా తరగతి గదులు, వంటశాల, డైనింగ్ హాల్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కపూటే తరగతులు నడుస్తున్నందున మధ్యాహ్నం పూట పిల్లలను ఎవరినీ బయటకు పంపొద్దని, ఎండలు ఎక్కువగా ఉన్నందున వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం చందు, ఉపాధ్యాయులు రవి, సురేశ్, పీఈటీలు వీరన్న, వాసు పాల్గొన్నారు.