మహిళల ఆరోగ్య సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు ఠంచనుగా పౌష్టికాహారం అందుతున్నది. వారి ఆరోగ్య సమాచారాన్ని అంగన్వాడీ టీచర్లు ఎప్పటికప్పుడు తెలుసుకుని సలహాలు సూచనలిస్తున్నారు. కేంద్రాలకు రాలేని లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి మరీ ఆహారం అందిస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన మహిళల్లో రక్తహీనత నివారణకు మిల్లెట్ ఆహారం ఇస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వచ్చాక అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మారిపోయాయి. కేంద్రాల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ఠంచనుగా పౌష్టికాహారం అందుతున్నది. ఐసీడీఎస్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు.. నాడు వర్కర్లు. సీఎం కేసీఆర్ వారిని టీచర్లు అని పిలవాలని అందరికీ పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు అంగన్వాడీ టీచర్లకు మూడుసార్లు వేతనాలు పెంచారు. 2014లో నెలకు రూ.4 వేలు ఉన్న వేతనం ఇప్పుడు రూ.13,650కు చేరుకున్నది. ఆయమ్మల వేతనం నాడు 2,200 ఉండగా నేడు రూ.7,800కు చేరుకున్నది. అంగన్వాడీ టీచర్లు ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా గర్భిణులకు కేంద్రాల్లో ఆకుకూరలు, కూరగాయలతో కూడిన భోజనం అందిస్తున్నారు.
సాధారణంగా మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన వారిలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత నివారణకు ప్రస్తుతం 14,941 మంది పిల్లలు, 8,828 మంది గర్భిణులు, బాలింతలకు మిల్లెట్ ఆహారం అందుతున్నది. అంగన్వాడీ టీచర్లు తల్లీబిడ్డకు పౌష్టికాహారం అందిస్తున్నారు. సేవలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసేందుకు ప్రభుత్వం వారికి ఉచితంగా స్మార్ట్ఫోన్స్ అందించింది. ఆన్లైన్ విధానంతో లబ్ధిదారులకు పారదర్శకంగా సేవలు అందుతున్నాయి. ఐసీడీఎస్ పరిధిలో ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 11 ప్రాజెక్ట్లు ఉన్నాయి. వీటి పరిధిలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా 8,114 మంది గర్భిణులు, 8,242 మంది బాలింతలు, 62,280 మంది చిన్నారులకు సేవలు అందుతున్నాయి.
అన్నీ కొత్త భవనాలే..
గతంలో సొంత భవనం లేక అంగన్వాడీ టీచర్లు కేంద్రాల నిర్వహణకు ఇబ్బంది పడ్డారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కొత్తగా అంగన్వాడీ కేంద్రాలు నిర్మించారు. కేంద్రాల్లో పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయి. టీచర్లు ఇంగ్లిష్ బోధించేందుకు మెటీరియల్ సైతం అందుబాటులో ఉన్నది. టీచర్లు వేసవిలో పిల్లలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు.
సఖి, స్వధార్, శిశు గృహ కేంద్రాలతో భరోసా&
స్త్రీ శిశు సంక్షేమశాఖ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలతో పాటు ప్రభుత్వం మహిళలకు రక్షణ కోసం ప్రతి జిల్లాలో సఖి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మహిళలు కుటుంబ పరంగా, సామాజికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా 181 అనే టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే చాలు వారికి తక్షణ సాయం అందుతుంది. అనాథలుగా మిగిలిన నవజాత శిశువుల సంరక్షణను భద్రాచలంలోని శిశు గృహ నిర్వాహకులు చూసుకుంటున్నారు. మరోవైపు బాల్యవివాహాలను అడ్డకోవడంలోనూ ఐసీడీఎస్ అధికారులు కీలకంగా పనిచేస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులను చేరదీస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి వారిని దత్తత ఇస్తున్నారు. అలాగే అనాథలుగా మిగిలిన ఆడపిల్లలకు స్వధార్ హోంలో ఆశ్రయం కల్పిస్తున్నారు.
వృద్ధులు, దివ్యాంగులకు అండగా..
ఐసీడీఎస్ పరిధిలోనే వృద్ధులు, దివ్యాంగులకూ సేవలు అందుతున్నాయి. పిల్లలు ఉండి కూడా నిరాదరణకు గురైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలను వయోవృద్ధుల శాఖ అధికారులు చూసుకుంటున్నారు. పిల్లల నుంచి వయో వృద్ధులకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. దివ్యాంగుల సంక్షేమానికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కులాంతర వివాహాలు చేసుకున్న దివ్యాంగ జంటలకు రూ.లక్ష సాయం అందిస్తున్నది. అవసరమైన వారికి ట్రైసైకిళ్లు, వీల్ చైర్స్ అందిస్తున్నది.
చాలా మార్పు వచ్చింది..
తెలంగాణ వచ్చాక ఐసీడీఎస్ పరిధిలో ఎన్నో మార్పులు వచ్చాయి. అంగన్వాడీ టీచర్ల జీతాలు పెరిగాయి. గతంలో కంటే ఇప్పుడు తల్లీపిల్లలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ఆన్లైన్ విధానంతో సేవల్లో పారదర్శకత వచ్చింది. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై అంగన్వాడీ టీచర్లు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. లబ్ధిదారులు కేంద్రానికి రాలేని పరిస్థితిలో ఉంటే అంగన్వాడీ టీచర్లు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పోషకాహారం అందిస్తున్నారు.
– శేషుమణి, అంగన్వాడీ మినీ టీచర్, డేగలమడుగు, సుజాతనగర్ మండలం
బాధ్యత పెరిగింది..
ఐసీడీఎస్ ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరిగాయి. ఇప్పుడు అంగన్వాడీ, వృద్ధులు, దివ్యాంగులు, సఖి, స్వధార్, ఐసీపీఎస్లు అన్ని ఒకే శాఖలో పరిధిలోకి వచ్చాయి. మహిళలకు అందాల్సిన సేవలన్నీ ఇప్పుడు అంగన్వాడీ టీచర్లే చూసుకుంటున్నారు. ఒక సీడీపీవో ప్రతిరోజు కేంద్రాలను సందర్శించాల్సిందే. ఆన్లైన్ విధానంలో సేవల్లో పూర్తి పారదర్శకత వచ్చింది.
– లెనీనా, సీడీపీవో కొత్తగూడెం
తల్లీబిడ్డల సంరక్షణ ఐసీడీఎస్ బాధ్యత..
అంగన్వాడీ కేంద్రం బాలింతలు, గర్భిణులు, పిల్లలకు అమ్మ ఒడి లాంటిది. వారికి సేవలు అందించడమే ఐసీడీఎస్ ధ్యేయం. 2014కు ముందు ఇలాంటి సేవలను నేను చూడలేదు. తెలంగాణ వచ్చాక ఐసీడీఎస్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రతి అంగన్వాడీ టీచర్ చేతిలో స్మార్ట్ఫోన్ ఉంది. ప్రభుత్వమే ఉచితంగా మొబైల్స్ ఇచ్చింది. ఆన్లైన్ విధానంలో లబ్ధిదారులకు పారదర్శకంగా సేవలు అందుతున్నాయి. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్లకు మూడుసార్లు జీతాలు పెరిగాయి. అంతేకాదు సీఎం కేసీఆర్ వారికి వర్కర్ల నుంచి టీచర్ల హోదా ఇచ్చారు.
– సబిత, డీడబ్ల్యూవో, కొత్తగూడెం