‘మాతాశిశు మరణాలకు తావు ఉండొద్దు.. ప్రతి గర్భిణి ఆరోగ్యంగా ఉండాలి.. సంపూర్ణ ఆరోగ్యవంతులైన శిశువులకు జన్మనివ్వాలి..’ అనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘నూట్రిషన్ కిట్స్’ పంపిణీ చేయనున్నది. గర్భిణుల్లో రక్తహీనతకు చెక్ పెట్టనున్నది. ఒక్కో కిట్లో కిలో ప్రోటీన్ పౌడర్ ప్యాకెట్, మూడు ఐరన్ సిరప్స్, ఖర్జూరా ప్యాకెట్, నెయ్యి ప్యాకెట్, ఒక ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ ఉండేలా ప్లాన్ చేసింది. కొత్తగూడెంలోని రామవరం మాతాశిశు కేంద్రంలో బుధవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ గర్భిణులకు కిట్స్ పంపిణీ చేయనున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ):కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కాబోయే అమ్మకు పోషకాలు అందాలి. అప్పుడే బిడ్డ బలవర్ధకంగా జన్మిస్తాడు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. అలాంటి ఆరోగ్యవంతమైన సమాజం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రక్తహీనత లోపం ఉన్న జిల్లాలను గుర్తించి ఆయా జిల్లాల్లోని గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల ద్వారా పౌష్టికాహారం అందించేందకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా బలవర్ధకమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. భద్రాద్రి జిల్లాలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలో ఉన్న రామవరం మాతాశిశు కేంద్రంలో మంత్రి అజయ్కుమార్ ప్రారంభించనున్నారు.
గర్భిణుల్లో రక్తహీనతను, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను తయారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీని డిసెంబర్లో ప్రారంభించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో కూడా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే రక్తహీనత, పోష్టికాహార లోపం వంటివి ఉన్న గర్భిణులను గుర్తించారు.
భద్రాద్రి జిల్లాలో 16,800 మంది గర్భిణులు ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందించనున్నారు. ఒక్కో పీహెచ్సీ నుంచి సుమారు 200 మందికి ఈ కిట్ల ను అందిస్తారు. 13 నుంచి 27 వారాల గర్భిణులకు మొద టి కిట్, 28 నుంచి 34 వారాల గర్భిణులకు రెండో న్యూ ట్రిషన్ కిట్ అందించనున్నారు. 13 నుంచి 27 వారాల గర్భిణులకు మొదటి కిట్ అందించిన నెల రోజుల తరువాత రెండో కిట్ను కూడా అందజేస్తారు.
ఒక్కో కిట్లో కిలో ప్రోటీన్ పౌడర్ ప్యాకెట్, 3 ఐరన్ సిరప్లు, ఖర్జూరం ప్యాకెట్, నెయ్యి ప్యాకెట్, ఒక ఆల్బెండజోల్ ట్యాబ్లెట్, ఒక కప్పు ఉంటాయి. జిల్లాలోని 29 పీహెచ్సీలు, 5 యూపీహెచ్సీలు, 4 సీఎఫ్డబ్ల్యూసీ కే్రందాల్లో ఈ న్యూట్రిషన్ కిట్లను భద్రపర్చనున్నారు. రక్తహీనత, పౌష్టికాహారం లోపం కలిగి ఉన్న గర్భిణులను పంపిణీ కే్రందాలకు తీసుకొచ్చేందుకు 102 వాహనాలను అందుబాటులో ఉంచారు.
కాబోయే తల్లి ఆరోగ్యంగా ఉండేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో జబ్బ కొలతల ద్వారా రక్తహీనత పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులుగా నమోదైన వారికి నెలనెలా ఆరోగ్య పరీక్షలు చేయడంతోపాటు జబ్బ కొలతలు తీసి రక్తహీనత లోపాన్ని గుర్తిస్తున్నారు. రక్తహీనత ఉన్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కలెక్టర్ అనుదీప్ ప్రతి బుధవారం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ తల్లీబిడ్డల సంరక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాద్రి జిల్లాలోని 7,023 మంది గర్భిణులకు ఈ కిట్లను అందజేస్తాం. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సుమారు 200 మందికి పైగా గర్భిణులకు ఈ కిట్లు అందనున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
-డాక్టర్ శిరీష, డీఎంహెచ్వో,భద్రాద్రి కొత్తగూడెం