ఖమ్మం, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుందా అని ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్నారు.. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆశల పల్లకీలో తేలియాడుతున్నారు. ఇది ఒకవైపు అయితే మరోవైపు డీఎస్సీలో రాష్ట్ర విద్యాశాఖ ఎన్ని ఖాళీలు భర్తీ చేయనున్నదనే అంశంపై స్పష్టత లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల ఖాళీల విషయంలో ఉద్యోగోన్నతుల అంశంపై ఎక్కువ అస్పష్టత నెలకొన్నది. అందుకు కారణం గత సంవత్సరం జరిగిన బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియలో ఎస్జీటీల ఉద్యోగోన్నతుల ప్రక్రియ నిలిచిపోవడమే. ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందాలంటే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) తప్పనిసరి. ఈ నిబంధన ఉండడంతో న్యాయస్థానాలు కూడా పక్కాగా నిబంధనలు అమ లు చేయాలని ఆదేశిస్తున్నాయి. దీంతో డీఎస్సీకి ఎస్జీటీల ఉద్యోగోన్నతులు అడ్డంకిగా మారాయి.
ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి పొందేందుకు జిల్లావ్యాప్తంగా 435 మంది అర్హులైన ఉపాధ్యాయులు ఉన్నారు. వీరికి సంబంధించిన సీనియార్టీ జాబితా ఇప్పటికే విద్యాశాఖాధికారులు సిద్ధం చేశారు. కానీ వీరిలో కేవలం 70శాతం మందే టెట్ అర్హత సాధించి ఉండడం మిగిలిన వారు అర్హత సాధించకపోవడంతో ఉద్యోగోన్నతులు నిలిచిపోయాయి. జిల్లాలో ఉద్యోగోన్నతులు కాకుండా 330 వరకు ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగోన్నతులు నిర్వహించకుండా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తే పోస్టులు తక్కువగా ఉంటాయి. ఉద్యోగోన్నతుల ప్రక్రియ కూడా నిర్వహిస్తే 330తో పాటు ఉపాధ్యాయులు ఉద్యోగోన్నతులు పొందితే ఖాళీల సంఖ్య 435 వరకు పెరుగుతుంది.
ప్రస్తుతం ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలనే డిమాండ్ ఎక్కువ టీచర్ల నుంచి వినిపిస్తున్నది. ఉపాధ్యాయ సంఘాన్నీ ఇప్పటికే ప్రత్యేక టెట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ విద్యాశాఖలోని ఉద్యోగోన్నతుల ప్రక్రియ కారణంగా డీఎస్సీ ఆలస్యమ య్యే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. కోర్టు కేసు లు, ఖాళీల వంటి అంశాల్లో విద్యాశాఖ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో.. అని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం ఖాళీగా ఉన్న పోస్టు ల్లో విద్యా వలంటీర్లును నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యోగోన్నతు ల ప్రక్రియ అనుకున్న దా నికన్నా ఆలస్యమవుతుందనేది స్పష్టమవుతున్నది.
త్వరలో టెట్ నోటిఫికేషన్ విడుదలవుతుందనే సంకేతాలు ఇప్పటికే ప్రభుత్వం నుంచి వెలువడుతున్నాయి. గతేడాది టెట్ పరీక్షల్లో జిల్లావ్యాప్తంగా పేపర్-1, 2కు 23,403మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్-1కు 12,923 మంది, పేపర్-2కి 10,480 మంది దరఖాస్తు చేశారు. పరీక్ష మొత్తం 150 మార్కులకు పేపర్ ఉంటుంది. వీటిలో ఓసీలు 90 మార్కులు సాధిస్తే అర్హత పొందినట్లు. బీసీలు 75, ఎస్సీలు 60 మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి. అది కూడా సరళంగా ఉండాలి. ఎస్జీటీల ఉద్యోగోన్నతుల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించాలని సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. పీజీహెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించిన మాదిరిగానే బదిలీల ప్రక్రియ జరగాలి.
సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టాలి. చిన్న చిన్న అడ్డంకులను అన్నింటినీ విద్యాశాఖ అధిగమించి ప్రక్రియ చేపట్టి డీఎస్సీ నిర్వహించాలి. డీఎస్సీలో కూడా అన్ని కేటగిరీలకు సంబంధించిన ఖాళీలన్నింటినీ భర్తి చేయాలి.