రఘునాథపాలెం, ఫిబ్రవరి 1: నూతన ఫీచర్లతో కొత్తకొత్త వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వాహ్వా అనేలా విభిన్న మోడళ్లతో కస్టమర్లను కనువిందు చేస్తున్నాయి. అయితే కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే సమయంలో అన్ని షోరూములూ తిరిగి గందరగోళానికి గురికావాల్సిన పనిలేదు. నేరుగా ‘నమస్తే తెలంగాణ’ ఆటో ఎక్స్పో కార్యక్రమానికి చేరుకుంటే సరిపోతుంది. అన్ని ఫీచర్లూ తెలుసుకొని, టెస్ట్ డ్రైవ్ చేసి మరీ నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశముంటుంది.
కొత్తగా కారు గానీ, బైక్ గానీ కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవారి కోసం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంస్థలు ఈ శని, ఆదివారాల్లో ఖమ్మం నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల గ్రౌండ్లో ‘ఆటో షో’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అన్ని ఆటోరంగ సంస్థలు ఒక వేదికపై తమ నూతన మోడల్ వాహనాలను అందుబాటులో ఉంచనున్నాయి.
ఈ ఆటో షోలో వాహన కంపెనీలన్నీ ఒకే వేదికపై ఉండడమే గాక ప్రత్యేక రాయితీ సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచనున్నాయి. ఆటో షో సందర్భంగా పలు కంపెనీలు ఆయా వాహనాలపై పెద్ద మొత్తంగా రాయితీ సదుపాయాన్ని కల్పించనున్నాయి. ఇక్కడ వాహనాలను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తారు. కొన్ని మోడల్ కార్లు, ద్విచక్ర వాహనాలను తగ్గింపు ధరలకు కూడా ఇవ్వనున్నారు. ఈ ఆటో షోలో పలు వాహనాల సమగ్ర సమాచారం ఈ వేదికగా లభించనుంది. ఈ ఆటో షోలో టెస్ట్ రైడ్ చేసి వాహనాలను కొనుగోలుకు అవకాశం కల్పించనున్నాయి. దీనికి తోడు వాహనాలకు రుణ సౌకర్యం కల్పించేందుకు పలు బ్యాంకులు సైతం ఈ ఆటో షోలో భాగస్వాములుగా ఉన్నాయి. ఆటో షోకు వచ్చే సందర్శకులకు ప్రత్యేక బహుమతులను అందించాలనే ఉద్దేశంతో కూపన్లను కూడా అందించనున్నారు. లక్కీడిప్ ద్వారా కూపన్లను తీసి విజేతలకు బహుమతులను అందజేస్తారు.
ఈ ఆటో షోలో వాహన కంపెనీలైన వోల్వో, మహావీర్ బెంజ్, మహావీర్ స్కోడా, సిట్రోయిన్ ప్రైడ్ మోటార్స్, ప్రైడ్ జీప్, వోక్స్వ్యాగన్ పీపీఎస్ మోటర్స్, బెనెల్లి, వెంకటరమణ బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్, ఎంజీ 100 రామ్ గ్రూప్, కియా ఆటోమోటివ్, రాయపూడి సుజుకీ, జావా హెచ్డీ, కాకతీయ టయోటా, టాటా మోటార్స్, మహీంద్రా, వజ్ర టీవీఎస్, వెంకటరమణ మోటార్స్ కంపెనీలకు చెందిన అన్ని రకాల వాహనాలు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు వాహనాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులు, గిఫ్ట్ స్పాన్సర్డ్ నీలోఫర్ ఈ ఆటో షోలో పాల్గొననున్నాయి.