ఖమ్మం ఎడ్యుకేషన్, మే 5 : మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఖమ్మం నగరంలో ఐదు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు నీట్ పరీక్షకు అత్యధికస్థాయిలో జరవుతుండడంతోపాటు నీట్ పరీక్షను గతంలో నిర్వహించిన అనుభవంతో పూర్తిస్థాయిలో సకల సౌకర్యాలు కల్పించారు. నాలుగు కేంద్రాల్లో 3,260 మంది విద్యార్థులకు 81 మంది గైర్హాజరు కాగా 3,179 మంది హాజరయ్యారు. బోర్డు నుంచి ఫ్లయింగ్ స్కాడ్స్, ఐదుగురు అబ్జర్వర్స్, కోఆర్డినేటర్ పార్వతిరెడ్డి పరీక్షా తీరును పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు 11గంటలకే చేరుకున్నారు. 12 గంటల నుంచి విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందించిన గోడ గడియారాలను కేంద్రాల వద్ద ఉంచారు. ఆ సమయం ప్రకారం 12 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షాకేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 5: జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో మొత్తం 1,174 మంది విద్యార్థులకు హాల్టిక్కెట్లు జారీ చేయగా 1,125 మంది పరీక్షకు హాజరయ్యారని, 49 మంది గైర్హాజరైనట్లు నీట్ పరీక్షల సిటీ కో ఆర్డినేటర్, పాల్వంచ నవభారత పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎంవీఎస్ రెడ్డి తెలిపారు. పాల్వంచ నవభారత్ పబ్లిక్ స్కూల్ పరీక్షా కేంద్రంలో 696 మందికి 668 మంది, కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కాలేజీలో 478 మందికి 457మంది హాజరయ్యారు.