పట్టణాలు, పల్లెల్లో జోరుగా కోళ్ల విక్రయాలు
మాంసంలో పోషక విలువలు ఫుల్
ధర కాస్త ఎక్కువైనా మార్కెట్లో మంచి డిమాండ్
మనలో రోగ నిరోధక శక్తి పెంపునకు దోహదం
సుజాతనగర్, ఫిబ్రవరి 6: వేడి వేడిగా నాటుకోడి పులుసు.. ఇల్లంతా ఘుమఘుమలు.. మసాలా వాసన.. ఊహించుకుంటేనే నోరూరుతున్నది కదా.. అదే మరి నాటు కోడి క్రేజ్. కొవిడ్ వచ్చిన తర్వాత ప్రతిఒక్కరూ పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలనుకుంటున్నారు. రోగ నిరోధకశక్తి పెంచుకోవడానికి కాస్తంత ఖర్చైనా వెనుకాడడం లేదు. ఈ కారణంతోనే మాంసం విక్రయాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పల్లెల్లో సహజ సిద్ధంగా పెరిగిన కోళ్లను తినడానికి ఇష్టపడుతున్నారు. నాటు కోళ్ల క్రయ విక్రయాలు, పోషక విలువలపై ప్రత్యేక కథనం.
చికెన్ సెంటర్లలోనూ విక్రయం..
చికెన్ సెంటర్లలో నాటుకోళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. చికెన్ షాపు నిర్వాహకులు నాటు కోళ్లను డ్రెస్సింగ్ చేసి మరీ విక్రయిస్తున్నారు. నాటుకోడి మాంసంలో కొవ్వు తక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నాటుకోళ్లు ప్రకృతిలో సహజసిద్ధంగా పెరుగుతాయి. వీటి పెంపకానికి స్టెరాయిడ్స్ అవసరం లేదు. మాంసం గట్టిగా, రుచిగా ఉంటుంది. త్వరగా జీర్ణమవుతుంది. మటన్తో పోలిస్తే దీని ధర తక్కువ కావడం, పోషకాలు ఎక్కువగా ఉండడం కారణంగా మాంస ప్రియులు ఎక్కువగా నాటుకోళ్లు తినడానికి ఇష్టపడుతున్నారు.
శుభకార్యాల్లోను ప్రత్యేకంగా..
శుభకార్యాలయాల్లో ప్రత్యేకమైన వంటగా కొందరు నాటు కోడి కూర వండుతున్నారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు రుచికరమైన మాంసాహారం అందించేందుకు ఇష్టపడుతున్నారు. బాయిలర్ కోడి ధర ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.200 నుంచి రూ.250 వరకు ఉంది. నాటుకోడి కిలో తక్కువలో తక్కువ రూ.350 వరకు పలుకుతుంది. ఈ ధర కొన్సిసార్లు రూ.450, రూ.500 వరకు పలికిన సందర్భాలు ఉన్నాయి. అయినా మార్కెట్లో నాటుకోడికి ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు.
పల్లెల నుంచి పట్టణాలకు తరలింపు
పల్లెటూళ్లలో పెరుగుతున్న నాటుకోళ్లను కొందరు వ్యాపారులు ద్విచక్రవాహనంపై వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో కోడికి రూ.200 వరకు ధర నిర్ణయించి సొమ్ములను వెంటనే గ్రామస్తులకు అందజేస్తున్నారు. సుజాతనగర్, సింగభూపాలెం, వేపలగడ్డ, నర్సింహసాగర్, సర్వారంలో నాటుకోళ్ల పెంపకం ఎక్కువగా ఉన్నది. పట్టణం, పెద్ద పెంచాయతీల్లోని చికెన్ దుకాణాల్లో ఒక్కో కోడిని కిలోకు రూ.350 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు.