ఖమ్మం సిటీ, జనవరి 7: ఖమ్మం ప్రీమియర్ లీగ్లో భాగంగా నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న జాతీయస్థాయి టీ – 20 చాంపియన్ షిప్ క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మూడోరోజైన శనివారం నేపాల్, శ్రీలంక జట్లు బరిలోకి దిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 150 పరుగులు తీసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన నేపాల్ టీం 15.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 152 పరుగులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత ఇరు జట్ల క్రీడాకారులను ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు కలకొండ మహేంద్రకుమార్ పరిచయం చేసుకున్నారు. మంచి ప్రతిభతో విజయం సాధించాలని క్రికెటర్లను ప్రోత్సహించారు. కార్యక్రమంలో కేపీఎల్ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్రదీప్, నిర్వహణ కార్యదర్శి మహ్మద్ మతీన్, సభ్యులు వెంకటప్రసాద్, సలీం, సీనియర్ క్రికెటర్ ఖయ్యూం, వీరేష్గౌడ్, బావారీ గుర్జార్, కార్ ఇన్ అధినేత వసీం, ఓలేటి సాంబమూర్తి పాల్గొన్నారు.