భద్రాచలం, డిసెంబర్ 29: భద్రాద్రి దివ్యక్షేత్రంలోని సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఏడో రోజు గురువారం భద్రాద్రి రామయ్య నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రూపంలో రామయ్యను దర్శించుకున్న భక్తులు ‘ఓ రామా నీ నామమెంతో రుచిరా..’ తన్మయత్వం చెందారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి సుప్రభాతం పలికి, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్యహోమాలు, నిత్య పూజలు జరిపారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆండాళ్తల్లికి 30 ద్రవిడ పాశురాలు విన్నవించారు.
అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు అందంగా అలంకరించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రీరామావతారంలో ఉన్న రామయ్యను ప్రత్యేక పల్లకిలో ఉంచి మంగళవాయిద్యాలు, మేళతాళాలు, కోలాట నృత్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ వార్షిక కల్యాణం నిర్వహించే మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. అక్కడ భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని విశ్రాంత మండపానికి తీసుకొచ్చారు. స్వామివారు అక్కడ కొంతసేపు విశ్రమించి తరువాత తిరువీధి సేవ కోసం తాతగుడి సెంటర్కు బయలుదేరారు. మిథిలా స్టేడియంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భద్రాద్రి వాసులను ఆకట్టుకుంటున్నాయి.
శ్రీమన్నారాయణుడికి శయన పాన్పు అయిన ఆదిశేషుని అంశతో అవతరించి, ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నదానికి నిదర్శనంగా నాగలిని ఆయుధంగా ధరించి, శ్రీకృష్ణ పరమాత్మకు సోదరుడిగా నిలిచి, ఆయనకు ధర్మస్థాపనలో సహకరించిన అవతారమే ఈ బలరామావతారం. సంకర్షణుడిగా పిలువబడే బలరాముడు ప్రలంబాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఈ అవతారాన్ని దర్శించిన వారికి మాందిగుళా గ్రహాల బాధలు తొలగిపోతాయన్నది పురాణోక్తి.