వేంసూరు, ఫిబ్రవరి 11: ప్రతి ఇంటికీ ఒక కుటుంబ పెద్ద ఉన్నట్లే, ప్రతి గ్రామానికి పెద్దగా గ్రామ దేవత ఉంటుందని, ఆమే.. అందరినీ సంరక్షించే గొంతేలమ్మ తల్లి అని రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఆమె ఆశీస్సులతో రాబోయే రోజుల్లో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులకు, సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. పార్థసారథిరెడ్డి స్వగ్రామమైన మండలంలోని కందుకూరు గ్రామంలో గ్రామ దేవత గొంతేలమ్మ తల్లి విగ్రహ, ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వారు హాజరయ్యారు.
ముందుగా అతిథులకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అతిథులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో రూ.20 లక్షల ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నిధులతో ఇప్పటికే గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు నిర్మించుకోగా, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి సౌజన్యంతో మరికొన్ని సీసీ రోడ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
మూడు దశల్లో కార్యక్రమాలు చేపట్టి పూర్తిస్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. అనంతరం గ్రామంలో అమ్మవారి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలను, అన్నదాన కార్యక్రమాలను వారు ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పగుట్ల వెంకటేశ్వరరావు, పాలా వెంకటరెడ్డి, బూరుగు నాగేశ్వరరావు, కొమరవరపు భూలక్ష్మి, వాసు పాల్గొన్నారు.
2025 నాటికి టీబీ నివారణే లక్ష్యం
2025 నాటికి దేశంలో టీబీ వ్యాధి నివారణే లక్ష్యంగా హెటిరో డ్రగ్స్ సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థ అధినేత, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీబీ బాధితులకు మూడేళ్లపాటు రూ.1.50 కోట్ల విలువైన న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తామన్నారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లిలోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో టీబీ బాధితులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు.
తొలుత ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ హెటిరో డ్రగ్స్ ద్వారా టీబీ బాధితులకు అండగా నిలుస్తున్న రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అనంతరం పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. టీబీ వ్యాధి నివారణ కోసం ఉమ్మడి జిల్లాను తాను దత్తత తీసుకుంటున్నానని, జిల్లాలోని టీబీ బాధితులందరికీ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
అలాగే, తల్లాడకు చెందిన ముగ్గురు టీబీ బాధితులైన చిన్నారులకు పూర్తి విద్యకు కావాల్సిన సహాయ సహకారాలను కూడా తమ సంస్థ ద్వారా అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం టీబీ బాధితులకు ఎమ్మెల్యే సండ్ర భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఢిల్లీ బృందానికి చెందిన టీబీ నివారణ డైరెక్టర్లు మహేశ్, రాజేశ్, డీఎంహెచ్వో మాలతి, అసిస్టెంట్ సీతారాం, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, వైస్ చైర్మన్ తోట సుజలరాణి, ఎంపీపీ దొడ్డా హైమావతి, పెనుబల్లి ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ రామారావు తదితరులు పాల్గొన్నారు.