కారేపల్లి, ఏప్రిల్ 13: చీమలపాడులో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలతోపాటు గాయపడిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. కారేపల్లి మండలం చీమలపాడులో గురువారం వారు పర్యటించారు. ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయిన గేట్ రేలకాయలపల్లికి చెందిన ధరంసోత్ లక్ష్మణ్ మృతదేహానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. చీమలపాడులో అజ్మీరా మంగు, స్టేషన్ చీమలపాడులో బానోత్ రమేశ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఒక్కో మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రాములునాయక్ రూ.రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. రమేశ్, మంగు అంత్యక్రియలు బుధవారం రాత్రి పూర్తి కాగా లక్ష్మణ్ అంతిమయాత్రలో తెలంగాణ రాష్ట్ర ఇన్కం ట్యాక్స్ కమిషనర్ జీవన్లాల్, స్థానిక ప్రజాప్రతినిధులు,బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనుకోని ప్రమాదంలో దురదృష్టవశాత్తూ తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతే ప్రతిపక్ష పార్టీల నాయకులు పరామర్శల పేరుతో చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగినప్పటి నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు తమను అప్రమత్తం చేస్తున్నారని, బాధిత కుటుంబాలకు తోడుగా ఉండాలని ఆదేశాలు చేస్తూనే ఉన్నారని, అందుకు అనుగుణంగా తామంతా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మృతుల పిల్లల చదువులు, ఉద్యోగాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు, పార్టీ పరంగా రూ.5 లక్షలు, ఎంపీ నామా నాగేశ్వరరావు తమ ట్రస్టు ద్వారా రూ.2 లక్షలు, ఎమ్మెల్యే రాములునాయక్ రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నారని అన్నారు. ఆరోపణలు చేసే ప్రతిపక్ష నాయకులు బాధిత కుటుంబాల దగ్గరకు వెళ్లి ఫొటోలు దిగడం కాకుండా మానవత్వం చూపి చేతనైనంత సాయం చేసి మాట్లాడాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు వాంకుడోత్ జగన్, ముత్యాల సత్యనారాయణ, ఉన్నం వీరేందర్, మాలోత్ కిశోర్, అజ్మీరా వీరన్న, రావూరి శ్రీనివాసరావు, దుగ్గినేని శ్రీనివాసరావు, ముత్యాల వెంకటప్పారావు, పెద్దబోయిన ఉమాశంకర్, అడప పుల్లారావు, బానోత్ సక్రాం, తోటకూరి రాంబాబు, శంకర్, అడ్డగోడ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.