నల్లగొండ, మే 7 : ఖమ్మం-వరంగల్-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి నాలుగు సార్లు ఎన్నికలు జరుగగా.. అన్ని సార్లూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని, ఈసారి కూడా గులాబీ జెండా ఎగురవేసేందుకు పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎనుగుల రాకేశ్రెడ్డి మంగళవారం నల్లగొండలో నామినేషన్ వేశారు. మొదట నల్లగొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీ గార్డెన్స్లో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చారు. అనంతరం మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి రాకేశ్రెడ్డి ఏఆర్ఓ, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు లక్ష్మీగార్డెన్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జగదీశ్రెడ్డి మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే మండలిలో నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వృథా అవుతుందని, అధికారంలో ఉన్న పార్టీని ఆ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే అవకాశం ఉండదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్లలో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ చేస్తే.. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ బస్సు యాత్ర మొదలు పెట్టగానే సీఎం రేవంత్కు వణుకు మొదలై రైతు బంధు వేయడం మొదలు పెట్టారన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన చోట బీజేపీకి డిపాజిట్ రాలేదని, బీజేపీ గెలిచిన చోట కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదని, అప్పుడు ఆ రెండు పార్టీలు పరస్పర సహాయం చేసుకొని ఓట్లు వేయించుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ గెలవగానే కృష్ణానదిని కేఆర్ఎంబీకి అప్పగించారని, బీఆర్ఎస్ పోరుతోనే మళ్లీ అసెంబ్లీలో తీర్మానం చేశారని అన్నారు. గోదావరి నీళ్లను ఇచ్చంపల్లి ద్వారా కావేరిలో కలపడానికి ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తున్నాడని, దాంతో కర్ణాటక, తమిళనాడుకు ప్రయోజనం జరిగి తెలంగాణకు తీవ్ర కరువు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆపడం ఒక్క కేసీఆర్ వల్లనే అవుతుందని, ఈ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా మెడలు వంచి గోదావరి నీళ్లను కాపాడుకుంటామని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ సైనికులు ఈ నెల 13న జరిగే ఎంపీ ఎన్నికల్లో, 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శక్తివంచన లేకుండా కృషి చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. మరోసారి మన పార్టీ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించాలి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల యువత చైతన్యం చూపించి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపిస్తే మండలిలో ప్రశ్నించే గొంతుక అవుతారు.
నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో ప్రశ్నించే గొంతుక అయి నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా. ఈ నియోజకవర్గం నుంచి అన్ని సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఈ సారి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే మండలిలో పట్టభద్రుల సమస్యలపై ప్రశ్నిస్తా. బీఆర్ఎస్లో ఉన్న స్వేచ్ఛ బీజేపీలో ఉండదు. ఆ పార్టీలో నాకు కనీస గౌరవం ఇవ్వలేదు. ఇక్కడ కేసీఆర్ ఎంతో గౌరవంతో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారు. మార్పు పేరుతో ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇస్తే రాష్ర్టాన్ని ఆగమాగం చేసింది.