ఖమ్మం, నవంబర్ 24: బీజేపీ ఆటలు తెలంగాణలో సాగబోవని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాష్ర్టాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. బీజేపీ ఉడత ఊపులకు ఆత్మాభిమానం కలిగిన తెలంగాణ ప్రజలు, తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు భయపడబోరని స్పష్టం చేశారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రాజ్యాంగ సంస్థలైన ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను వారి మీదకు ఉసిగొల్పి వేధిస్తోందని విమర్శించారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు అక్రమ ఆస్తుల గురించి విచారించకపోగా బీజేపీలో చేరమని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అదే మాదిరిగా తెలంగాణలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు చెందిన గ్రానైట్ సంస్థల్లోనూ ఈడీ అధికారులు దాడులు చేశారని అన్నారు. ‘బీజేపీలో చేరాలని మీ మామకు చెప్పండి’ అంటూ రవిచంద్ర అల్లుళ్లను బెదిరించారని ఆరోపించారు. రాజ్యాంగంపై గౌరవం లేని బీజేపీ నాయకులు రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోస్తూ దుర్మార్గపు విధానాలను అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా లాంటి రాష్ర్టాల్లో అక్కడి ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ నేతలు.. తెలంగాణ ప్రభుత్వాన్నీ కూలదోసేందుకు కుట్ర పన్ని అడ్డంగా దొరికిపోయారని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆ కుట్రలో కేంద్ర హోంమంత్రి అమిత్షా, ఆ పార్టీ రాజకీయ వ్యవవహారాల కార్యదర్శి సహా ముఖ్యనాయకులు ఎంతో మంది ఉన్నట్లు బయటపడిందని వివరించారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ గళం విప్పిన రోజు నుంచే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణపై ద్వేషం పెంచుకున్నదని అన్నారు.
ఫామ్హౌస్లో అడ్డంగా దొరికిన బీజేపీ స్వామీజీలు జైల్లో ఊచలు లెక్కిస్తుంటే ఆ పార్టీ నేతలు కిషన్రెడ్డి, బండి సంజయ్ మాత్రం నీతులు వల్లిస్తున్నారని విమర్శించారు. రాష్ర్టానికి రావాల్పిన నిధులను కూడా ఇవ్వకుండా కేంద్రం కక్షసాధిస్తోందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేని బీజేపీ నేతలు ఆయన కుమార్తె కవితను టార్గెట్ చేశారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ రూ.490 కోట్లు ఖర్చు చేసినా ప్రజల చేతిలో ఆ పార్టీకి ఓటమి తప్పలేదని అన్నారు.
గొత్తికోయల దాడిలో అటవీ శాఖ అధికారి శ్రీనివాసరావు మృతిచెందడం పట్ల టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉద్యోగులు ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నందున ఏ ఒక్కరూ తొందరపడొద్దని సూచించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, టీఎస్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, టీఆర్ఎస్ నేతలు ఖమర్, కమర్తపు మురళి, నల్లమల వెంకటేశ్వర్లు, బెల్లం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.