లక్ష్మీదేవిపల్లి, మార్చి 27: పేదలు, కార్మికులు, కర్షకుల కోసమే పుట్టిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా తమ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షమే వహిస్తుందని అన్నారు. ఐదు దశాబ్దాలుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అందించిన సేవల ఫలితంగానే తనను మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నుకొని చట్టసభకు పంపారని గుర్తుచేశారు. మండలంలోని చాతకొండ హమాలీ కాలనీలో స్థానిక ప్రజలు బుధవారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడికి ఎప్పుడూ ప్రజాదరణ లభిస్తూనే ఉంటుందని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయని అన్నారు. అహంకారంతో విర్రవీగే నాయకులను, ప్రజాప్రతినిధులను ప్రజలు ఎప్పటికీ ఆదరించరని అన్నారు. సీపీఐ నాయకులు సాబీర్పాషా, సారయ్య, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.