టేకులపల్లి/ ఇల్లెందు, డిసెంబర్ 21: గర్భిణుల ఆరోగ్యమే ప్రధానమని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. మాతాశిశు మరణాల నివారణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గర్భిణుల్లో రక్తహీనత నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను మండలంలోని సులానగర్ పీహెచ్సీలో బుధవారం ఆమె పంపిణీ చేసి మాట్లాడారు. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందడంలేదని, వారు రక్తహీనతతో బాధపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని అన్నారు. టేకులపల్లి మండలానికి మొత్తం 311 న్యూట్రిషన్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిందని అన్నారు. అనంతరం సులానగర్ పీహెచ్సీ అభివృద్ధి పనుల కోసం రూ.10 లక్షలను మంజూరు చేశారు. అనంతరం పీహెచ్సీలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు చీరెలు పంపిణీ చేశారు. యూనిసెఫ్ అండ్ కేర్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్వాష్ ట్యాంకర్ను కూడా ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు దిండిగాల రాజేందర్, కేవీ శ్రీనివాసరావు, కేఎం తార, సీతమ్మ, మాలోత్ సురేందర్, రాజేందర్, ప్రసాద్, బసవయ్య, బానోత్ రామానాయక్, చీమల సత్యనారాయణ, భూక్యా పాపానాయక్, బానోత్ రవికుమార్, శ్రీనివాసరాజు, జాటోత్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఎమ్మెల్యే హరిప్రియ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు ఈ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కిట్లలోని పౌష్టిక పదార్థాలను గర్భిణులు ఇప్పటికే తమకున్న మరో బిడ్డకు తినిపించి కడుపులో పెరుగుతున్న బిడ్డకు పౌష్టికాహారాన్ని దూరం చేయొద్దని సూచించారు. అనంతరం ఏఎన్ఎంలకు చీరలనూ పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు డి.వెంకటేశ్వర్లు, రంగనాథ్, కృష్టవేణి, మేరి, పి.మాధవరావు, పి.వెంకటేశ్వర్లు, కె.రేణుక, ఆజాం, రాజేశ్ పాల్గొన్నారు.