ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ సత్తుపల్లి/ కల్లూరు, ఏప్రిల్ 28:: రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వీ.శ్రీనివాసగౌడ్ శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కల్లూరు మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణానికి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. 10:30కు కల్లూరులో గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియాన్ని ప్రారంభిస్తారు. 11:30కి వేంసూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. సత్తుపల్లి మండలం గంగారంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మధ్యాహ్నం ఆవిష్కరిస్తారు. సాయంత్రం 3:30 గంటలకు సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాల నుంచి తిరిగి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు బయలుదేరుతారు. కాగా, మంత్రి శ్రీనివాస్గౌడ్ శనివారం పర్యటించనున్న ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ, డీసీసీబీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కూరాకుల నాగభూషణం తదితరులు హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. ఈ పర్యటనంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
రూ.3.50 కోట్లతో కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్మించిన మినీ స్టేడియాన్ని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ శనివారం ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. వీటిని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంటకవీరయ్య శుక్రవారం పరిశీలించి అధికారులు, నాయకులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బీరవల్లి రఘు, కట్టా అజయ్కుమార్, పాలెపు రామారావు, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, కాటంనేని వెంకటేశ్వరరావు, పెడకంటి రామకృళష్ణ, కొరకొప్పు ప్రసాద్ తదితరులు ఉన్నారు.
వేంసూరు, ఏప్రిల్ 28: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులు, నాయకులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. శనివారం వెంకటాపురం గ్రామంలో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరుతూ వేంసూరు, కందుకూరు గ్రామాల్లో శుక్రవారం ఆయన ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు తిలకం దిద్ది స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి వస్తామంటూ సమాధానమిచ్చారు. అనంతరం వెంకటాపురంలోని ఆత్మీయ సమ్మేళన ప్రాంగణంలో జరిగే ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పగుట్ల వెంకటేశ్వరరావు, గొర్ల శ్రీనివాస్రెడ్డి, నున్నా రాంబాబు, పాల వెంకటరెడ్డి, కంటే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.