కొణిజర్ల, మార్చి 4: ఉద్యోగ, ఉపాధి కల్పనకు తెలంగాణ రాష్ట్రం చిరునామాగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దేశంలోనే అత్యద్భుత ప్రగతి సాధించిందని రాష్ట్రంగా ఖ్యాతి గాంచిందని ఉద్ఘాటించారు. కొణిజర్ల మండలం అమ్మపాలెం విజయ ఇంజినీరింగ్ కళాశాలలో జేఎన్టీయూహెచ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళాను మాజీ ఎమ్మెల్యే బాణోతు చంద్రావతి, ఆర్జేసీ కృష్ణ, ఇతర ప్రముఖులతో కలిసి శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ రంగంలో 5.50 లక్షల ఉద్యోగాలు, ఇతర పరిశ్రమలు, ఫార్మా రంగంలో మరో 5.50 లక్షల ఉద్యోగాలు కల్పించామని వివరించారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఐటీ, పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుందని స్పష్టం చేశారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. విజయ కాలేజీ ఏర్పాటు చేసిన ఈ జాబ్మేళాలో సుమారు 30 కంపెనీల సహకారంతో 3 వేల మందికి పైగా ప్లేస్మెంట్స్ లభించడం శుభపరిణామమని అన్నారు.
తెలంగాణ సర్కారు ప్రభుత్వ రంగంలో ఇప్పటి వరకూ 1.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వివరించారు. జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ సతీశ్కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. విజయ కాలేజీ చైర్మన్ పారుపల్లి ఉషాకిరణ్ మాట్లాడుతూ ఈ మెగా జాబ్మేళాను తమ కళాశాలలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రిన్సిపాల్ జాన్బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల వైస్చైర్పర్సన్ పారుపల్లి విజయలక్ష్మి, ఎస్బీఐటీ చైర్మన్ గుండాల కృష్ణ, వివిధ కంపెనీల ప్రతినిధులు హర్ష, కార్తీక్, అనూష, ప్రణీత్, ఎస్ఆర్ఎం కిరణ్, కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫీసర్ కరీం, ఇన్చార్జి ఫరీద్బాబా తదితరులు పాల్గొన్నారు.