రఘునాథపాలెం, జూలై 22: ఖమ్మం నియోజకవర్గంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ లైసెన్స్ అందించడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అర్హులైన యువతీ యువకులు, వాహనదారులు ఉచిత లైసెన్స్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లైసెన్స్ల మేళాలో భాగంగా ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఉచిత లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ (ఎల్ఎల్ఆర్) కాపీలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ఖమ్మం నియోజకవర్గంలో వాహనాలను కలిగి 10 వేల మంది పైచిలుకు వాహనదారులు, డ్రైవింగ్ వచ్చిన వాళ్లు ఉన్నట్లు ప్రత్యేక సర్వే ద్వారా గుర్తించామన్నారు. అర్హులైన వాహనదారులకు, డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికీ పువ్వాడ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా లైసెన్స్ ఇప్పించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. వాహనాల సంఖ్య నానాటికీ అధికమవుతుండడంతో ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనదారులందరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులను అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వాహనాలు ఉన్న వారందరూ ఈ మేళాను వినియోగించుకొని ఇబ్బందులను తొలగించుకోవాలని, క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు ఈ లైసెన్స్ మేళా ద్వారా 2 వేల మందికి ఉచితంగా లెర్నర్స్ లైసెన్సులను అందించినట్లు మంత్రి వివరించారు. మరో 8 వేల మందికి ఇవ్వాల్సి ఉన్నట్లు చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరైన లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. జిల్లా రవాణా శాఖ అధికారి తోట కిషన్రావు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు వల్లభనేని రామారావు, ఆర్జేసీ కృష్ణ, బచ్చు విజయ్కుమార్, పిన్ని కోటేశ్వరరావు, దండా జ్యోతిరెడ్డి, రావూరి సైదుబాబు, తన్నీరు శోభారాణి, మడూరి సైదారావు, కన్నం ప్రసన్నకృష్ణ, సంక్రాంతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.