ఖమ్మం, అక్టోబర్ 16: ఎవరెన్ని ఎత్తులు వేసినా ఓడేది కాంగ్రెస్సేనని, విజయతీరాన్ని తాకేది బీఆరెస్సేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఎంతమంది వచ్చి ఎన్నిక కుట్రలు పన్నినా ఈ ఎన్నికల్లో జరిగేది ఇదేనని తేల్చిచెప్పారు. నేను లేని టైంలో, బీ ఫాం తీసుకోవడానికి నేను హైదరాబాద్ వెళ్లిన సమయంలో కొందరు కుట్రదారులు ముఠాగా ఏర్పడి గజదొంగల్లా ఖమ్మంలో దూరారని ఆరోపించారు. అంతేగాకుండా కొందరిని కాంగ్రెస్లో చేర్చుకున్నామంటున్నారని, అలా చెప్పుకున్నంత మాత్రాన, సోషల్మీడియాలో పోస్టులు పెట్టుకున్నంత మాత్రాన వారు గెలిచినట్టు కాదని స్పష్టం చేశారు. ఖమ్మానికి చెందిన యువ నాయకుడు పారా ఉదయ్ అధ్వర్యంలో సోమవారం ముస్తాఫానగర్ సెంటర్ నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పారా ఉదయ్తోపాటు 200 మంది యువతీ యువకులు మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పారా నాగేశ్వరరావు, పారా శ్రీనివాస్, సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. గతంలో తన మీద పోటీ చేసిన వారినే ఓడించానని, ఇప్పుడు మళ్లీ ఓడిస్తానని, అదేం పెద్ద విషయం కాదని వివరించారు. రానున్న రోజుల్లో అదే జరుగుందని స్పష్టం చేశారు. యువత భవితకు గొప్ప వేదిక బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. అందుకని యువతీ యువకులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని అన్నారు.
కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ.. ఖమ్మం నగరాభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పని చేసిన మంత్రి పువ్వాడ వెంటే నడుస్తామని, ఖమ్మాన్ని తీర్చిదిద్దిన బీఆర్ఎస్తోనే ఉంటామని స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్లోకి వెళ్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. అందులో తన పేరును ప్రస్తావిస్తే సహించబోనని మేయర్ తేల్చిచెప్పారు. టీ కోసం వస్తున్నామంటూ ఫోన్లు చేస్తున్నారు, వారు టీ తాగాలనుకుంటే బయట చాలా షాపులు ఉన్నాయని, అకడికెళ్లి తాగొచ్చు కానీ తమ ఇంటికి మాత్రం రావొద్దని హితవుచెప్పారు. సుడా చైర్మన్ విజయ్కుమార్, కార్పొరేటర్లు మక్బూల్, నాయకులు అమరగాని వెంకటేశ్వర్లు, పొన్నం వెంకటేశ్వర్లు, నాగరాజు పాల్గొన్నారు.
ఖమ్మం, అక్టోబర్ 16: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని మంత్రి అజయ్కుమార్ పిలుపునిచ్చారు. కేసీఆర్కు హ్యాట్రిక్ సీఎంగా, తనకు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కోరారు. ఖమ్మం 54వ డివిజన్ వీడీవోస్ కాలనీలో ఆడిటర్ శివరామ కృష్ణ ప్రసాద్ అధ్వర్యంలో సోమవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. ఖమ్మం అభివృద్ధికి తట్టెడు మట్టి పోయనివాళ్లు కూడా ఇప్పుడు ఇక్కడి ప్రజలను ఓట్లు అడగాడానికి వస్తున్నారని అన్నారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, వివిధ సంఘాల నాయకులు కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, కర్నాటి కృష్ణ, చెరుకూరి కృష్ణమూర్తి, చిన్ని కృష్ణారావు, బొమ్మ రాజేశ్వరరావు, పోట్ల శ్రీదేవీ శ్రీకాంత్, వల్లభనేని రామారావు, బత్తుల మురళి, బొడేపుడి నాగేశ్వరరావు, బండి కిశోర్, నంబూరి మురళి, నున్నా అప్పారావు, కిలారు బాబ్జీ, పోట్ల రాధిక, వంగాల కొండల్రావు తదితరులు పాల్గొన్నారు.