కూసుమంచి, ఏప్రిల్ 8 : పాలేరు నియోజకవర్గం మీదుగా వెళ్తున్న రైల్వే లైన్ మార్పు కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడుతానని, రైతుల ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల మీదుగా రైల్వే ట్రాక్ వెళ్తున్న దృష్ట్యా సోమవారం ఆయా గ్రామాల రైతులు కూసుమంచిలో మంత్రి పొంగులేటిని కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే లైన్ నిర్మాణానికి ఎనిమిది నెలల క్రితం రూపకల్పన జరిగిందని, ట్రాక్ నిర్మాణం వల్ల రైతుల విలువైన భూములు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. దీనిపై హైదరాబాద్లో రైల్వే అధికారులతో మాట్లాడుతానని, అవసరమైతే కేంద్ర మంత్రితో కూడా మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానన్నారు.
సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు రాయల నాగేశ్వరరావు, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, తిరుమలాయపాలెం జడ్పీటీసీ బెల్లం శ్రీను, ఎంపీపీ బోడా మంగీలాల్, పార్టీ నాయకులు నరేశ్రెడ్డి, అరవింద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా.. జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం బాధ్యులు సాంబశివరెడ్డి, వై.వెంకటేశ్వరరావు, గర్రం కాంతారావు, శశిధర్రెడ్డి, అశోక్రెడ్డి, నాజరయ్య, శివకృష్ణ, మతీన్, ఇర్షాద్ అహ్మద్, జగన్, సీతారాములు తదితరులు మంత్రిని కలిశారు.