ఖమ్మం, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను తమ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి పేద కుటుంబానికీ ఇల్లు మంజూరు చేస్తామని, సంక్రాంతి నాటికి ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇళ్ల స్థలాలు, నూతన రేషన్ కార్డుల మంజూరును కూడా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో ఇల్లులేని పేద కుటుంబం ఉండకూడదనే లక్ష్యంగా ప్రతి పేద కుంటుంబానికీ ఇంటి నిర్మాణానికి సహకారం అందిస్తామని, ఇంటి స్థలం మంజూరు చేస్తామని అన్నారు. ఖమ్మం ఐడీవోసీలో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్లతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ పథకాలకు మాత్రం ఆటంకం లేకుండా అమలు చేస్తామని అన్నారు. ఆరు గ్యారెంటీల్లో రెండైన మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంలో వైద్య ఖర్చుల పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం వంటివి అమలు చేస్తున్నామని అన్నారు. ఈ నెల 28 వరకు మరో రెండు గ్యారెంటీల అమలును కూడా ప్రారంభిస్తామని అన్నారు. సంక్రాంతి వరకు ఇంకో రెండు గ్యారెంటీలను అమలు చేసేందకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు.
పార్లమెంటు ఎన్నికలు సమీపంలో ఉన్నందువల్ల పంచాయతీ ఎన్నికలను ఇబ్బంది లేకుండా ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుందనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈ నెల 20న శాసన సభ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న గత ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల్లో జరిగిన అవకతకలపై విచారణ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ ఆస్తులు, భూములను ఆక్రమించిన వారిపై, నిధులు కొల్లగొట్టిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. నిజాయితీగా పనిచేసిన వారిపై రాజకీయపరమైన కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ తమ సమస్యలను వివరించుకునేందకు అవకాశం కల్పిస్తామన్నారు. ధరణిలో ఉన్న లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వీఆర్వో, వీఆర్ఏలకు జరిగిన అన్యాయం సమీక్షించి ఆయా ఉద్యోగ సంఘాలతో చర్చించి వారికి న్యాయం చేస్తామని అన్నారు. ఇసుక, మట్టి, ఇతర మైనింగ్ మాఫియా పై ఉక్కు పాదం మోపుతామన్నారు.