అశ్వారావుపేట/ములకలపల్లి, జూన్ 13 : ‘సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణాల్లో సాగు భూములు కోల్పోయిన తమకు పరిహారం ఇస్తారా? లేదా?’ అంటూ నిర్వాసితులు ప్రశ్నించారు. ఈ మేరకు ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి గురువారం వచ్చిన మంత్రులను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పోడు గిరిజనులతో కలిసి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వాసితుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
దీంతో ఆందోళన సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఒడ్డురామవరం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్ పనులను పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, రాష్ట్ర వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిలు ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లారు. అయితే ప్రాజెక్టు కాలువ, పంప్హౌస్ నిర్మాణాల్లో భూములు కోల్పోయిన ఆ గ్రామానికి చెందిన నిర్వాసితులు పద్దం రాజులు, బానోతు కాసనా, బానోతు మంగ్య, గుగులోతు సోమ్లా, వెంకన్న, లావుడ్యా ఇల్లమ్మ, పద్దం కృష్ణమ్మ, కారం కౌసల్య తదితరులు మంత్రులు వచ్చిన విషయం తెలుసుకున్నారు.
వెంటనే అక్కడికి చేరుకొని మంత్రులను అడ్డుకోబోయారు. వెంటనే వారిని పోలీసులు పక్కకు నెట్టివేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పోడు భూముల గిరిజనులతో కలిసి రోడ్డుపై రాస్తారోకో చేశారు. ప్రాజెక్టు కాలువల కోసం తీసుకున్న తమ భూములకు పరిహారం ఇవ్వాలని, పాతికేళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని ధరావత్ సోమ్లా, శంకర్, బానోతు సోమ్లా, రాంబాబు, ధరావత్ వీరన్న, తదితరులు మంత్రులను డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలిపించుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు కాలువల నిర్మాణంలో సాగు భూములు కోల్పోయిన తమకు పరిహారం అందలేదని వివరించారు.
పోడు చేసుకుంటున్న తమను అటవీ అధికారులు కేసులతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుల చు ట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నట్లు వివరించారు. తక్షణమే పరిహారం మంజూరు చేయాలని, పోడు భూములకు హక్కు పత్రాలు అందించాలని, కేసులు ఎత్తివేయాలని విజ్ఙప్తి చేశారు. అందుకు మంత్రి పొంగులేటి స్పందించారు. లిఖిత పూర్వకంగా వినతిపత్రం ఇస్తే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అన్నారు. దీంతో ఆందోళన విరమించిన నిర్వాసితులు, పోడు గిరిజనులు మంత్రి పొంగులేటికి వినతిపత్రం అందించారు. పోడు గిరిజనులు జర్పుల నారాయణ, ధరావత్ యాకూబ్, కోర్సా ఆదినారాయణ, గుగులోతు భోజ్యా, భద్రు, లావూడ్యా బుజ్జి, బానోతు మల్లేష్, రామచంద్రు, బానోతు నవుశ్య తదితరులు పాల్గొన్నారు.