ఖమ్మం/ ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 30: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. కేఎంసీ, మెప్మా ఆధ్వర్యంలో నగరంలోని లకారం ట్యాంక్బండ్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మట్టి వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. సహజమైన మట్టితో చేసిన విగ్రహాలను పూజిస్తే పర్యావరణానికి పాటుపడినట్లేనని అన్నారు. మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడంలో ఖమ్మం నగరం రాష్ట్రంలోనే ముందుండాలని ఆకాంక్షించారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, సరిపూడి రమాదేవి, ఆళ్ల నిరీశారెడ్డి, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఏసీపీ ఆంజనేయులు, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, మెప్మా అధికారి సుజాత తదితరులు పాల్గొన్నారు.
మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన మేయర్
ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో కేఎంసీ, మెప్మా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్లో మట్టి వినాయకక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. నగరంలోని పటేల్ స్టేడియం, పెవిలియన్ గ్రౌండ్ వద్ద మేయర్ పునుకొల్లు నీరజ ఈ విగ్రహాల పంపిణీని ప్రా రంభించారు. కార్పొరేటర్లు బుడిగెం శ్రీనావాస్, ఎస్కే.మక్బుల్ తదితరులు పాల్గొన్నారు.
బొమ్మ విద్యాసంస్థల ఆధ్వర్యంలో..
నగరంలోని బొమ్మ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికీ మంత్రి అజయ్ హాజరై మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. సుమారు 300 మట్టి గణపతులను భక్తులకు అందజేశారు. పర్యావరణానికి హాని కలుగకుండా మట్టి గణనాథులనే పూజించాలని కోరారు. మేయర్ నీరజ, కళాశాల చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ సత్యప్రసాద్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ కమర్తపు మురళి పాల్గొన్నారు.