ఖమ్మం, అక్టోబర్ 26: పాలేరు నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని నాడు ప్రకటించిన మాజీ తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఎవరికి.. ఏ పార్టీకి పాలేరుగా పనిచేస్తున్నారో ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు సవాల్ విసిరారు. ఖమ్మం నగరం 33వ డివిజన్లో గురువారం స్థానిక నాయకుడు గీత వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. తాను వెనుకబడిన వర్గాలకు పదవులు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తుంటే మాజీ తుమ్మల వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన కులాలపై తుమ్మలకు చిన్నచూపు ఉండడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇప్పుడు తుమ్మల పక్కన ఉన్న నాయకులంతా రౌడీషీటర్లేనని, ఖమ్మం డీసీసీబీలో అక్రమార్కులకు పాల్పడినవారేనని ఆరోపించారు. తుమ్మల బీసీలు, ఎస్సీలు, మహిళలను పిలిచే పద్ధతి జిల్లాలో ప్రతిఒక్కరికీ తెలుసునన్నారు. ప్రస్తుతం తుమ్మలను ప్రజలను ఛీత్కరించుకుంటున్నారన్నారు. ఖమ్మం నియోజకవర్గమే తనకు మొదటి ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. కానీ తుమ్మల ఎక్కడ సీటు ఖాళీగా ఉంటే అక్కడ పాగా వేస్తారని ఆరోపించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని, ప్రజాధనంతో నీటిని సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్పై ఆధారపడి వేలాది కార్మికులు, వ్యాపారులు జీవనం సాగిస్తున్నారని, కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. అలాంటిమార్కెట్ను ఖమ్మం నగరం నుంచి వేరే ప్రాంతానికి తరలించేందుకు తుమ్మల యత్నించారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచే మార్కెట్ తరలిపోకుండా కార్మికుల పక్షాన నిలబడ్డానని గుర్తుచేశారు. ఇక ముందు కూడా మార్కెట్ తరలిపోకుండా శాయశక్తులు ఒడ్డుతానని ప్రకటించారు. నాయకుడు గీత వెంకన్న మాట్లాడుతూ.. ఖమ్మం నగరం నుంచి మారెట్ ను తరలించాలని గతంలో నాటి మంత్రి తుమ్మల తీవ్రంగా ప్రయత్నించారన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ ఆ కుట్రలన్నింటినీ భగ్నం చేశారన్నారు. మార్కెట్ ఖమ్మంలో ఉంటేనే నగరంలో వేలాది మంది బతుకులు నిలబడతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, వర్తక సంఘం సభ్యులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలం, మలిశెట్టి వెంకటేశ్వర్లు, పారా నాగేశ్వరరావు, సోమా నరేశ్, వేములపల్లి వెంకన్న, మన్నెం కృష్ణ, నున్నా మాధవరావు, కార్పొరేటర్ ఉమ పాల్గొన్నారు.