ఇల్లెందు, మే 27 : సర్కారు వైద్యం మారుమూల ప్రజలందరికీ చేరువైందని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. శనివారం ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కిడ్నీ బాధితులు ఖమ్మం, సత్తుపల్లి, పాల్వంచ పట్టణాలకు ఎంతో వ్యయ ప్రయాసాలకోర్చి ప్రయాణించి ఖర్చు చేసి డయాలసిస్ చేయించుకునే వారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్ సహకారంతో ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో రూ.50 లక్షలతో ఐదు పడకల డయాలసిస్ సెంటర్ను ప్రారంభించినట్లు తెలిపారు. డయాలసిస్ చేయించుకోవాలంటే రూ.5 వేల ఖర్చు అవుతుందని, ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా డయాలసిస్ చేయించుకోవచ్చన్నారు.
డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కలెక్టర్ అనుదీప్, డీఎంహెచ్వో రవిబాబు కృషి మరిచిపోలేదన్నారు. ఇల్లెందులోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇన్పేషెంట్లు 50మంది, ఔట్ పేషెంట్ల సంఖ్య 800 వరకు ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో నమోదు అవుతున్నదన్నారు. గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, కంటి, దంత, డెలివరీ సర్జరీలు, టిఫా స్కాన్ తదితర సౌకర్యాలు, స్పెషలిస్టు డాక్టర్లు మెరుగైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, డాక్టర్ శిరీష్, డాక్టర్ హర్ష, జిల్లా అధికార ప్రతినిధి పులిగళ్ళ మాధవరావు, మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, మున్సిపల్ కమిషనర్ అంకుషావలి, వైస్ చైర్మన్ జానీపాషా, కౌన్సిలర్లు, హెడ్ నర్సు జగదాంబ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.