మధిర, జూలై 28: ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పట్టణాలు, గ్రామాల్లో సహజంగానే వ్యాధులు విజృంభిస్తుంటాయి. తగిన జాగ్రత్తలు పాటించకపోతే వీటితో పెద్ద ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు సంక్రమిస్తున్న వేళ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అనేవి ఎంతో ముఖ్యం. వీటి విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తాయి. వీటిల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటివి మరింత ప్రమాదకరంగా మారుతాయి. అందుకే వీటి విషయంలో ఎంతో జాగ్రత్త అవసరం. ఒకవేళ జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
సూచనలు పాటించాలి..
వ్యాధుల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది కూడా ఇంటింటికీ వెళ్లి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ఆసుపత్రులకు వెళ్లినప్పుడు వైద్యులు చెప్పే సూచనలూ పాటించాలి. అలా పాటిస్తేనే ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పూలకుండీలు, కూలర్లు, కొబ్బరిబోండాలు, రబ్బర్టైర్లు, నీటితోట్లలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేయాలి.
డెంగీ లక్ష ణాలు..
డెంగీ సోకితే తీవ్రమైన జ్వరం తోపాటు ఒంటినొ ప్పులు, తలనొప్పి వంటివి వస్తాయి. ఏకధాటిగా ముక్కు కారటం, చర్మంపై ఎర్రదద్దుర్లు రావడం, కనుగుడ్లు వెనకాల నొప్పి రావడం, బీపీ పడిపోవడం, అధికంగా దాహం వేయడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ అనంతరం వైద్యుల సూచనలు పాటించాలి.
దోమల నిర్మూలన అత్యవసరం..
సీజనల్ వ్యాధులు, జ్వరాల విజృంభణలో దోమలే ప్రధాన కారకాలుగా ఉంటున్నాయి. అందుకని వ్యాధులు, జ్వరాల నివారణకు దోమల నిర్మూలనే అత్యవసరం. ఇందుకు పరిసరాల పరిశుభ్రత అనివార్యం. దోమకాటు గురికాకుండా దోమతెరలు వినియోగించాలి. వానకాలంలో ఎక్కువగా దోమలు పెరగడం వల్ల ప్రజలు దోమకాటుకు గురై అనారోగ్యం పాలవుతుంటారు. నీటి నిల్వల వల్ల దోమలు అధికంగా పెరగడంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు సోకి ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. అంతేకాకుండా వాతావరణంలో వచ్చే మార్పుల్లో భాగంగా వానల్లో తడవటం వల్ల ఎక్కువమంది జలుబు, దగ్గు, జ్వరం భారిన పడుతుంటారు. కొందరికి డెంగీ జ్వరం కూడా సాధారణంగా వచ్చిపోతుంది. మరికొందరిని ప్రాణాంతక స్థితికి తీసుకెళ్తుంది. జ్వరాలు సోకిన వారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా వ్యాధి నిర్ధారణ జరిగి తదనుగుణంగా మందులు వాడితే వ్యాధులు నియంత్రణలోకి వస్తాయి. తర్వాత తగ్గిపోతాయి.
వైద్యులను సంప్రదించాలి..
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో జ్వరాలు సోకిన వెంటనే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలి. వైద్యుల సలహా మేరకే మందులు వాడాలి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వచ్చిప్పుడు ఆందోళనతో ప్రైవేటు వైద్యశాలలకు వెళ్తే ఆర్థికంగానూ నష్టపోయే ప్రమాదముంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.- డాక్టర్ స్రవంతి, ప్రభుత్వ వైద్యురాలు, బోనకల్లు