ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 27: బీజేపీ నాయకుల్లారా.. ఖబడ్డార్.. ఇక్కడ మీ పాచికలు పారవు.. ఇది కేసీఆర్ అడ్డా అంటూ ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ మండిపడ్డారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన తీరును నిరసిస్తూ నాయకులు, ప్రజాప్రతినిధులు గురువారం నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పార్టీ శ్రేణులు నల్లజెండాలు చేతబూని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఇల్లెందు క్రాస్రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆయా డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, రఘునాథపాలెం మండల నాయకులు భారీగా తరలివచ్చారు. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, ఖబడ్దార్ బీజేపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా మేయర్ నీరజ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కర్నాటి కృష్ణ మాట్లాడారు. ఇతర రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలదోసిన నీచ చరిత్ర బీజేపీదీ అని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడం నీచమైన పని అన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నిప్పులాంటి వారని, వారి జోలికి వస్తే మాడి మసైపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ నాయకులకు బానిసలుగా మారిన రాష్ట్ర బీజేపీ నాయకులు నిసిగ్గుగా జరిగిన సంఘటను సమర్థించుకోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీ కేంద్ర సర్కార్ తీరును అడుగడుగున నిలదీస్తున్న సీఎం కేసీఆర్పై కేంద్ర ప్రభుత్వ పెద్దలు కక్షకట్టి కుట్రలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ వ్యక్తిగత సహాయకుడు చిరుమామిళ్ల కిరణ్కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ల బాధ్యులు, రఘునాదపాలెం టీఆర్ఎస్(బీఆర్ఎస్)మండల అధ్యక్షుడు వీరునాయక్, ఇతర ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.