ఖమ్మం/ రఘునాథపాలెం, జనవరి 19: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మేయర్ నీరజ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ కంటి చూపు చాలా ముఖ్యమైనదని అన్నారు. రూ.వేలు వెచ్చించి నిరుపేదలు కంటి పరీక్షలు చేయించుకునే స్థితిలో ఉండరని గమనించిన సీఎం కేసీఆర్ వారి కోసమే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. నగరంలోని 26వ డివిజన్ గాంధీ పార్కులో కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. పరీక్షలతోపాటు కళ్ల అద్దాలనూ ఉచితంగా అందచేయడం గొప్ప విషయమని అన్నారు. అనంతరం నగరంలో నిర్మాణంలో ఉన్న వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ పనులను పరిశీలించారు. డిప్యూటీ మేయర్ ఫాతిమా, ఏడీఎంహెచ్వో రాంబాబు, స్వరూపరాణి, నవ్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని జడ్పీటీసీ మాళోతు ప్రియాంక పేర్కొన్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె గురువారం మండలంలోని జింకలతండా గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు పరికరాల సహాయంతో చేస్తున్న కంటి పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకొని వైద్యులు అందించే కళ్లజోళ్లు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ఆమె కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. మండల ప్రత్యేకాధికారి విజయ, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్ మోతీలాల్, వైద్యాధికారులు పాల్గొన్నారు.