సెలవులు ఉన్నందున పనులన్నీ త్వరితగతిన ముగించాలి
డబుల్ బెడ్ రూం ఇళ్లకు విద్యుద్దీకరణ పనులు చేపట్టాలి
నిబంధనల మేరకే క్లినికల్ స్థాపనలకు అనుమతులు
వివిధ శాఖల జిల్లా అధికారుల సమీక్షలో ఖమ్మం కలెక్టర్
మామిళ్లగూడెం, జూలై 13: ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో మొదటి విడతగా చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులన్నింటినీ గ్రౌండింగ్ చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మన బడి పనుల పురోగతిపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొదటి విడతగా 426 పాఠశాలలు ఎంపిక చేసి వాటిల్లో సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో మండలానికి రెండు చొప్పున 42 పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు రూ.35 లక్షలను ఆయా పాఠశాలల ఖాతాల్లో జమ చేశామన్నారు. పాఠశాలలకు సెలవులు ఉన్నందున పనులు ముమ్మరంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
విద్యుద్దీకరణ పనులు పూర్తి చేయాలి
డబుల్ బెడ్ రూం ఇళ్లలో విద్యుద్దీకరణ పనులు పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో విద్యుత్ పనుల పురోగతిపై చర్చించారు. అన్ని ఆవాసాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయాలకు విద్యుద్దీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
నిబంధనల మేరకే క్లినికల్స్ అనుమతులు
జిల్లాలో నిబంధనల మేరకు క్లినికల్స్ స్థాపనలకు అనుమతులు మంజూరు చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన జిల్లా క్లినికల్స్ స్థాపనల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో క్లినికల్ స్థాపనలకు 90 రోజుల చెల్లుబాటుతో తాతాలిక రిజిస్ట్రేషన్ ఇచ్చేవారని, ఇప్పుడు దానిని మరో 15 రోజులు పొడిగించారని అన్నారు. ఖమ్మం జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 178 ఆసుపత్రులు, 74 డయాగ్నోస్టిక్ కేంద్రాలు, 11 ఫిజియోథెరపీ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 67 ఆసుపత్రులు, 36 డయాగ్నోస్టిక్ కేంద్రాలు, 5 ఫిజియోథెరపీ కేంద్రాలు అనుమతులతో నడుస్తున్నాయని తెలిపారు. కొత్త క్లినికల్ స్థాపనల నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల్లో వైద్యుల రికార్డులు పరిశీలించాలన్నారు.
నిబంధనల మేరకు సూచించిన విధంగా నమోదుకు దరఖాస్తులు వస్తేనే తాతాలిక రిజిస్ట్రేషన్ ఇవ్వాలని, ఈ విషయాలను జిల్లా వెబ్సైట్లో ప్రదర్శించాలని సూచించారు. తాతాలిక రిజిస్ట్రేషన్ చెల్లుబాటు సమయంలోగా క్షేత్ర తనిఖీలు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ రిజిస్టర్ ప్రాక్టీషనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో సీపీ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్ మొగిలి స్నేహాలత, కేంఎసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, వివిధ శాఖల అధికారులు డాక్టర్ మాలతి, బాగం కిషన్, డాక్టర్ సురేశ్, శిరీష, యాదయ్య, హరిప్రసాద్, సురేందర్, శ్యామ్ప్రసాద్, శ్రీనివాసరావు, నాగశేషు పాల్గొన్నారు.