మామిళ్లగూడెం, ఏప్రిల్ 3: విడాకుల నోటీసులు ఇచ్చిందనే అక్కసుతో రోకలిబండతో మోది భార్యను భర్త హతమార్చిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకున్నది. ఖమ్మం రెండో పట్టణ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలం పినపాకకు చెందిన దేవమణి (36) ఖమ్మం డిపో పరిధిలో కండక్టర్. ఆమెకు తల్లాడ మండలం లక్ష్మీపురానికి చెందిన బంధువు ఇనపనూరి రాంబాబు అలియాస్ రాములుతో 2006లో వివాహమైంది. వారికి కుమారుడు ప్రణవ్తేజ్, కుమార్తె అశ్విత. పిల్లలు పుట్టిన కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్త రోజూ మద్యం తాగి వచ్చి భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీంతో ఆమె పిల్లలతో కలిసి ఖమ్మం నగరంలోని బస్డిపో రోడ్డులో గది అద్దెకు తీసుకుని ఉంటున్నది. కుమారుడు ఈఏడాది పదోతరగతి చదువుతుండడంతో అతడిని ఓ ప్రైవేటు పాఠశాల హాస్టల్లో ఉంచి చదివిస్తున్నది.
ఈ క్రమంలో ఫిబ్రవరిలో దేవమణి భర్తకు విడాకుల నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్న భర్త ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి భార్య నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ‘నోటీసులు ఇస్తావా..’ అంటూ భార్యతో వాగ్వాదానికి దిగాడు. కుమార్తె బంధువులకు కాల్ చేస్తుండగా రాంబాబు అడ్డుకున్నాడు. కుమార్తె గొంతు పట్టుకుని పక్కకు నెట్టాడు. పకనే ఉన్న రోకలిబండతో భార్య తలపై మోది అక్కడి నుంచి ఉడాయించాడు. ఘటనలో దేవమణి తీవ్ర గాయాల పాలైంది. సమాచారం అందుకున్న దేవమణి అమ్మానాన్న ఘటనా స్థలానికి చేరుకుని టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పోలీసులు ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం దేవమణి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆమె స్వగ్రామమైన తల్లాడ మండలంలోని పినపాకకు తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు టౌ టౌన్ సీఐ శ్రీధర్ తెలిపారు. నిందితుడు రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
తల్లి చనిపోయిందని తెలియకుండానే పరీక్షకు..
ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 3: దేవమణి కుమారుడు ప్రణవ్తేజ్ ప్రైవేటు కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఆదివారం ఉదయం పదోతరగతి పబ్లిక్ పరీక్షకు హాజరయ్యాడు. ఉదయమే తల్లి మృతిచెందిందన్న విషయం తెలిసినప్పటికీ బంధువులు ప్రణవ్ తేజ్కు చెప్పలేదు. పరీక్ష రాసి బయటకు వచ్చిన తర్వాత ప్రణవ్తేజ్ను ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తీసుకొచ్చారు. విగతజీవిగా తల్లిని చూసిన కుమారుడు బోరున విలపించాడు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, బంధువులు ప్రణవ్తేజ్ను ఓదార్చారు.