వైరా రూరల్, అక్టోబర్ 25: వివాహేతర సంబంధం నేపథ్యంలో తమ్ముడిని అన్న హతమార్చిన ఘటన సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా వైరా మండలంలోని రెబ్బవరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాదం సుబ్బమ్మకు ముగ్గురు కుమారులు రామకృష్ణ, రామారావు, నరేశ్. వీరిలో రామకృష్ణ, నరేశ్కు వివాహమైంది. నరేశ్ మద్యానికి బానిస కాగా రెండేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. తల్లి సుబ్బమ్మ, నరేశ్, రామకృష్ణ, అతని భార్య ఒకే ఇంట్లో ఉంటున్నారు.
రామకృష్ణ వారం క్రితం తన భార్య నరేశ్తో చనువుగా ఉండడాన్ని చూసి కోపోద్రిక్తుడయ్యాడు. నరేశ్ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. మూడు రోజుల క్రితం తల్లి ఖమ్మంలోని కుమార్తె ఇంటికి వెళ్లగా రామకృష్ణ భార్య పుట్టింటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన రామకృష్ణ ఆదివారం సాయంత్రం తమ్ముడు నరేశ్తో కలిసి మద్యం తాగారు. అనంతరం ఇంటికి వెళ్లి ఇద్దరూ నిద్రపోయారు. సోమవారం తెల్లవారుజామున నరేశ్పై రామకృష్ణ గొడ్డలితో విచక్షణారహితంగా దాడిచేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఘటనలో తీవ్రగాయాల పాలైన నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఏసీపీ రెహమాన్, సీఐ సురేశ్, ఎస్సై శాఖమూరి వీరప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.