Illegal mining | బోనకల్లు, మే 3 : మట్టిని కొల్లగొడుతున్నారు. కొందరు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో మట్టి దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం లక్ష్మీపురం, గోవిందాపురం గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి సంపదతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఉన్న మట్టిని కొందరు అక్రమార్కులు జేసీబీల సహాయంతో తవ్వుతూ టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రేయింబవళ్లు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది.
గుట్టలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. మట్టి దిబ్బలు మైదానాలుగా మారుతున్నాయి. మట్టి మాఫియా ఆగడాలు అంతకంతకూ రెట్టింపవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం.. మట్టి మాఫియాకు కొందరు అండగా నిలవడంతో దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. నిత్యం తరలిస్తున్న మట్టి అక్రమ రవాణాను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం లక్ష్మీపురం, గోవిందాపురం గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి సంపదతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఉన్న మట్టిని కొందరు అక్రమార్కులు జేసీబీల సహాయంతో తవ్వుతూ టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రేయింబవళ్లు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కొందరు చోటా బడా నాయకుల అండదండలతో దందా కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల నుంచి అనుమతులు తీసుకుని గడువు తీరినా మట్టి తరలింపును మాత్రం ఆపడం లేదు. చింతకాని మండలం ప్రొద్దుటూరు, పాతర్లపాడు తదితర ప్రాంతాల్లో మట్టి గుట్టలను విచ్చలవిడిగా తవ్వుతూ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. అయితే గుట్టల తవ్వకాలకు, రైతుల భూములు చదును చేసుకునేందుకు సంబంధిత శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన అనుమతి మేరకు మైనింగ్ శాఖకు ముందుగా సెస్ చెల్లించాలి. క్యూబిక్ మీటర్కు రూ.42 చొప్పున చెల్లించిన తర్వాతే మట్టి తవ్వకాలు చేపట్టాలి. కానీ.. ఇలాంటి నిబంధనలేవీ ఇక్కడ అమలు కావడం లేదు.
పట్టించుకోని టాస్క్ఫోర్స్
మట్టిని కాపాడాల్సిన టాస్క్ఫోర్స్ అధికారులు పట్టించుకోకపోవడంతో మాఫియాదారులు యథేచ్ఛగా మట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు భవనాలు, రియల్ వెంచర్లు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు తరలిస్తూ టిప్పర్కు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక ట్రాక్టర్కు రూ.1,500 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి, సహజసిద్ధంగా ఉండే వనరులను కాపాడేందుకు ప్రత్యేకంగా ఒక పరిరక్షణ కమిటీని నియమించింది. ఇందులో మైనింగ్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖలతో కలిసి టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. మట్టి, బొగ్గు, ఇసుక, సహజ వనరులను కాపాడే బాధ్యతను ప్రభుత్వం ఆయా శాఖలకు అప్పగించింది. కానీ.. సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టి అక్రమ తరలింపుదారులు ఏకంగా 20 అడుగుల లోతు పెట్టి మట్టిని తరలిస్తూ క్వారీలను ఏర్పాటు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై బాధ్యత గల పౌరులు ప్రశ్నిస్తే.. మా ఇష్టం వచ్చినట్లు మట్టిని తరలిస్తాం. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు యువకులు తెలిపారు. టిప్పర్లు, లారీలకు అడ్డుపడితే తొక్కించుకొని వెళ్తామని ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని టాస్క్ఫోర్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, పైగా వారికి అనుమతులు ఉన్నాయంటూ అధికారులే చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు.
లారీల్లో తరలిస్తున్న మట్టి
మట్టి తరలింపుపై ఇన్చార్జ్ తహసీల్దార్ శ్వేతను వివరణ కోరగా.. లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో రైతుల భూముల నుంచి మట్టి తోలకాలు జరుపుతున్న విషయం వాస్తవమేనని, రైల్వే మూడో లైన్ నిర్మాణం కోసం ఆ మట్టిని తరలించేందుకు కాంట్రాక్టర్కు అనుమతులు ఉన్నాయని తెలిపారు. మైనింగ్ శాఖ వారు అనుమతి పొందినట్లుగా అనుమతి పత్రాలను కూడా పంపించారని చెప్పారు. ఇంకా అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే టాస్క్ఫోర్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అక్రమంగా.. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే వాహనాలను సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.