పాల్వంచ, మార్చి 18: పాల్వంచలోని శ్రీనివాసగిరిపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తిరు కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 10 వేల మందికి పైగా భక్తులు కొండ మీదకు చేరుకుని ఈ మహోత్సవాన్ని వీక్షించారు. భారీ వర్ష సూచన ఉన్నప్పటికీ భక్తులు భారీ సంఖ్యలో కొండ మీదకు చేరుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పాల్వంచ డగ్రిస్ట్ అసోసియేషన్ బాధ్యులు చర్యలు తీసుకున్నారు. మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు.
ఔషధ నియంత్రణ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్ మెడికల్ క్యాంపునకు వచ్చారు. హైదరాబాద్కు చెందిన సౌమిత్రి రామాచార్యులు, వినయ్కుమారాచార్యులు, మణిదీపాచార్యులు, భద్రాద్రి రామాలయానికి చెందిన వరుణ్కుమారాచార్యులు, ఈ ఆలయ ప్రధాన ఆర్చకులు నగేశ్ శర్మ, ఆరుట్ల ఫణీరాజాచార్యులు స్వామి వారి కల్యాణాన్ని శాస్ర్తోక్తంగా జరిపించారు.
పాల్వంచ తహసీల్దార్ రంగా ప్రసాద్ దంపతులు స్వామి వారికి పట్లు వస్ర్తాలు, తలంబ్రాలు తీసుకొచ్చి కల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం కొండ కింద ప్రజలకు అన్నదానం నిర్వహించారు. భక్త సమాజ మండలి అధ్యక్షుడు ఆరుట్ల లక్ష్మణ్, ఊకే భద్రయ్య, కందుకూరి రామకృష్ణ, ధర్మపురి రాముల తదితరులు పాల్గొన్నారు. కాగా, కొండ కింద గల శ్రీవారి పాదాల మండపం వద్ద జరిగిన ప్రత్యేక పూజల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.