ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 4: పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతులనే పూజిద్దామని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని హోల్సేల్ కూరగాయల మార్కెట్లోని సువిశాలమైన షెడ్లో గురువారం ఏర్పాటు చేసిన మట్టి గణపతుల యూనిట్ను ఆయన ప్రారంభించారు. కోల్కతా కళాకారులు తయారు చేసిన మట్టి గణపతులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల కంటే మట్టి విగ్రహాలతోనే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు.
నగరంలోని మున్నేరువాగుపై ఇటీవల చెక్డ్యాం నిర్మించడం వల్ల అర టీఎంసీ నీటిని నిలుపుదల చేసుకుంటున్నట్లు చెప్పారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను మున్నేరులో నిమజ్జనం చేస్తే ఆ నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. అనంతరం హోల్సేల్ కూరగాయల మార్కెట్కు చెందిన ట్రాన్స్పోర్టు వాహనాదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు మేయర్ నీరజ, లక్ష్మీప్రసన్న, కే.వెంకటేశ్వర్లు, పగడాల నాగరాజు, తోట రామారావు, కమర్తపు మురళి, రాపర్తి శరత్, కన్నం ప్రసన్నకృష్ణ, లక్ష్మణ్గౌడ్, ఉస్మాన్పాషా, షకీనా, పాల్వంచ కృష్ణ, ఆర్.మల్లేశం, డీ.నిర్మల, గోళ్ల అవినాశ్, పత్తి రవి తదితరులు పాల్గొన్నారు.