స్వామియే.. శరణమయ్యప్ప… అనే శరణుఘోష వినిపించే రోజులివి. అయ్యప్ప నామంతో భక్తకోటి పులకించే సమయమిది.. కఠోర దీక్షలో నియమావళిని ఆచరిస్తూ స్వామి సేవలో తరించే కాలమిది.. అయ్యప్ప దీక్షలు చేపట్టేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎంతోమంది అయ్యప్ప మాల ధరించి స్వామి పూజల్లో మునిగి తేలుతున్నారు. ఏటా మాలధారుల సంఖ్య పెరుగుతున్నది.
ఖమ్మం కల్చరల్, నవంబర్ 4: హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకం. ఈ మాసాంతం ఆలయాలు నిత్య పూజలతో, భక్తులతో, దీక్ష తీసుకున్న స్వాములతో సందడిగా కన్పిస్తాయి. ఊరురా.. వాడ వాడలా అయ్యప్ప శరణుఘోష వినిపిస్తుంది. ‘స్వామియే శరణమయ్యప్ప’… అంటూ భక్తకోటి శబరిమల వైపు అడుగులు వేసేందుకు దీక్ష పూనుకున్నారు. శరీరాన్ని, మనస్సును చెడు నుంచి మంచి మార్గం వైపు మళ్లించేవే ఈ దీక్షలు. దాంట్లో భాగంగా ఈ మాసంలో స్వామియే శరణం అంటూ అయ్యప్ప మండల దీక్ష మార్గాన్ని అన్వేషించేవారు, సన్మార్గంలో జీవన యాత్ర సాగించాలనుకునే వారు విధిగా జీవితకాలంలో ఒక్కసారైనా శబరిమలై యాత్రచేసి అయ్యప్పను దర్శించుకోవాలని ఆకాంక్షిస్తుంటారు. అయ్యప్ప మాలధారణ మొదలుకుని, దీక్ష విధానం, పర్యటన పూర్తయి తిరిగి వచ్చేవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర నియమాలన్నింటిపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
అయ్యప్ప అవతరణ గాథ..
పూర్వకాలంలో మహీషి అనే రాక్షసి బోలా శంకరుడి వరం పొంది అక్కడి ప్రజలను, ఇంద్రాది దేవతలను సైతం హింసిస్తుంది. తనకు ఆడ, మగ కలయితో పుట్టిన వారితో గానీ, విల్లుతో గానీ, ఆయుధాలతో గానీ మరణం ఉండకుండా వరం పొందింది. ఆ తర్వాత ఇంద్రాది లోకాల్లోకి వెళ్లి వికృత చేష్టలకు దిగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. మహీషీ చేష్టలకు భయాందోళనకు గురైన దేవతలు మహావిష్ణువును శరణు కోరుతారు. దీంతో ఆయన మోహినీ అవతారం ఎత్తి పరమశివుణ్ని మోహిస్తాడు. వీరిద్దరి కలయిక వల్ల అయ్యప్ప జన్మిస్తాడు. మణిమాలతో కేరళ రాజ్యంలోని అటవీ ప్రాంతంలో పా్ంయ రాజులకు దొరుకుతాడు. మణిమాలతో దొరికిన ఆ శిశువుకు మణికంఠుడు అని నామకరణం చేస్తారు. మహీషిని వధించి దేవతలు, మునుల పూజందుకుంటాడు. అనేక మహి మలతో పాండ్యరాజులకు దగ్గరవుతాడు.
అయ్యప్పను సేవించే విధానం ఇదీ…
అయ్యప్పస్వామిని నవవిధ సేవలతో పూజిస్తుంటారు. నవ విధాలు అనగా శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, ధ్యానం, స్కృతం, ఆత్మ నివేదన. స్వామిదీక్షలో ఇరుముడికి మహావిశిష్టత ఉంటుంది. ఇరుముడిలో రెండు ముడులుంటాయి. ఒక ముడిలో అయ్యప్పస్వా మి స్వరూప ముద్ర, కొబ్బరికాయ, స్వామివారికి సమర్పించే వస్తువులు ఉంటాయి. కొబ్బరికాయలను స్వ చ్ఛమైన ఆవునెయ్యితో నింపుతారు. ఈ నెయ్యి జ్ఞా నానికి ప్రతీక. కొబ్బరికాయలను బిగించడం వైరాగ్యానికి చిహ్నంగా భావించి మూతపెడతారు. కా యను ఆత్మ అనే లక్కతో (ప్రస్తుతం గోధుమ పిండితోకూడా) సీజ్ చేస్తారు. మనస్సులోని జ్ఞానాన్ని సంపూర్ణంగా అయ్యప్పకు నిండు మనస్సుతో అర్పించుకున్నట్లు భావిస్తారు. దీనినే ఆత్మనివేదన అంటారు. అయప్పస్వామి దీక్షలో పరమార్థం కూడా ఇదే. రెండో ముడి వెనుక భాగంలో ఉంటుంది. ఇందు లో బియ్యం, బెల్లం, అటుకులు, కూరగాయలు, పూజా సామగ్రి ఉంచుతారు. బియ్యం, కూరగాయలు పెద్ద పాదంలో పర్యటిస్తున్న సమయంలో వంట కోసం, పూజా సామగ్రి పర్యటన సమయంలో పూజ కోసం స్వాములు ఉపయోగించాల్సి ఉంటుంది.
పడిపూజ ఎందుకు..?
అయ్యప్ప సన్నిధానంలో 18 మెట్లు ఉంటాయి. ఇవి కామ, క్రోధ.. మొద లైన అరిషఢ్వర్గాలని ప్రతీతి. మనిషిలోని 18 రకాల చెడు గుణాలు తొలగిపోవటానికి దీక్షలో పడిపూజ (మెట్టపూజ) నిర్వహిస్తారు. అయ్యప్పను దర్శించిన ప్రతిసారి చెడు లక్షణాల్ని విడిచిపెట్టి మంచివాడిగా మారాలని కోరుకుంటూ ఈ పూజ నిర్వహిస్తారని గురుస్వాములు చెబుతారు.
ఇరుముడి అత్యంత ప్రాధాన్యం…
దీక్షలో 41 రోజుల తర్వాత వేసే ఇరుముడికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇరు అంటే రెండు అని అర్థం. అనగా రెండు ముడులు అని. ముందు ముడి (మూట)లో పీటం, భస్మం, గంధం, కొబ్బరికాయలు, నెయ్యి, పూజా సామగ్రి ఉంటాయి. వెనుక ముడి (రెండోమూట) ప్రయాణానికి కావాల్సిన వస్తువులు ఉంటాయి. వీటినే పుణ్యపు మూట, పాపపు మూటగా పిలుస్తారు.
నల్లని వస్ర్తాలే ఎందుకు…?
దీక్షలో ఉన్న భక్తులు నల్లని వస్ర్తాలు ధరించడంపై ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. ఒకానొక సందర్భంలో అయ్యప్పస్వామి శనీశ్వరున్ని వరం కోరుతాడు. తన భక్తుల వద్దకు శని రాకుండా, ఎలాంటి కష్టాలు రాకుండా చూడాలని కోరడంతో అప్పుడు శనీశ్వరుడు తనకు ఇష్టమైన నల్లని వస్ర్తాలు ధరించిన భక్తుల వద్దకు తా ను (శని) వెళ్లనని చెప్తాడు. అందుకే భక్తులు శనీశ్వరునికి ఇష్టమైన నల్లరంగు వస్ర్తాలు ధరిస్తారని గురుస్వాములు చెప్తారు. అయితే నల్లని వస్ర్తాలు ధరించటం వల్ల లాభాలు కూడా కొన్ని ఉన్నాయని శాస్త్ర జ్ఞానం చెప్తోంది. దీక్ష చలికాలంలో వస్తుంది. నల్లనిరంగు వేడిని స్వీకరిస్తుంది. శరీరానికి వెచ్చదనం ఇస్తుంది. దుమ్మూధూళి సైతం నిలువదు. శబరిమల కొండలపై స్వామిని దర్శించుకునేందుకు అడవిలో కాలినడకన వెళ్లాలి. అందువల్ల రాత్రుల్లో జంతువుల నుంచి రక్షణ కూడా ఈ వస్ర్తాలు సహకరిస్తాయి.
ఏటేటా కన్నె స్వాములు…
శబరి కొండల్లో ఉండే మాలికాపురోత్తమ అయ్యప్ప స్వామిని ప్రేమిస్తుంది. పెళ్లి చేసుకోమ్మని కోరుతుంది. ఇది విన్న స్వామివారు చిరునవ్వుతో తిరస్కరిస్తాడు. అయినా ఆమె పట్టువీడదు. దీంతో.. కన్నెస్వాములు తన మాల ధరించి రానప్పుడు వివాహమాడుతానని స్వామి ఆమెకు మాటిస్తాడు. అయితే.. అది ఎప్పటికీ జరగనిదని పరమార్థం. ఇందులో భాగంగానే కన్నె స్వాముల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీక్ష మొదటిసారి చేపట్టేవారు కన్నెస్వాములు, తరువాత వరుసగా కత్తిస్వామి, గంటస్వామి, గధాస్వామి, గురుస్వాములుగా పిలుస్తారు. తొమ్మిది నుంచి 18 సార్లు శబరిమలై యాత్రకు వెళ్లివచ్చిన వారు కన్నెస్వాముల దీక్ష చేపట్టేందుకు సహకరిస్తారు.
మహిమాన్వితం అయ్యప్ప మాలధారణ
నేను 17 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అయ్యప్పమాల వేసుకుంటున్నాను. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం వల్ల భక్తిభావం పెరిగి ఒక క్రమశిక్షణ అలవడుతుంది. అయ్యప్ప మాలధారణ వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం. యువత కూడా అయ్యప్పమాల వేసుకుంటే 41 రోజుల పాటు దీక్ష చేయడం వల్ల మనస్సు అదుపులోకి వస్తుంది. –రాచకొండ హరి
తల స్నానం..
అభ్యంగన స్నానం దేవునికి ప్రీతిపాత్రం. అయ్యప్ప మాల ధరించిన ప్రతి ఒక్కరూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తప్పక చల్లటి నీళ్లతో తలంటు స్నానం చేయాల్సిందే. దీనితో మనసుకు హాయినిస్తుంది. చెడు భావనలను దూరం చేసి, దైవత్వం వైపు ఏకాగ్రత కుదురుతుందనేది భావన.
అలంకరణ..
అయ్యప్పకు నిండుగా అంకరణ చేసుకున్న స్వాములంటే ఇష్టం. ముఖ్యంగా మణికంఠులు ఒళ్లంతా చందనం బొట్లు పెట్టుకుని అలంకరించుకుంటే అయ్యప్ప స్వామికి మహా ప్రీతి అని గురుస్వాములు చెపుతుంటుంటారు. మాల ధరించిన నాటి నుంచి దీక్షా సమయం ముగిసి తిరిగి మాల విసర్జన చేసే సమయానికి కూడా దీక్షా పరుడి నుదిటిన చందనం బొట్టు ఉండాలి. చందనం బొట్టుకు తోడుగా కుంకుమ, విభూధి, గంధంలలో ఏదో ఒకదానిని పెట్టుకుంటారు.
స్వామి దర్శనం ఇలా…
అయ్యప్పను సన్నిధానంలో దర్శించాలనుకునే వారు రెండు రకాలుగా కాలినడక మార్గంలో ప్రయాణిస్తారు. అవి. 1.పెద్దపాదం, 2.చిన్నపాదం. పెద్దపాదం ద్వారా స్వామిని దర్శించుకోవాలంటే సుమారు 60కి.మీ దట్టమైన ఆటవీ ప్రాంతంలో పయనించాలి. ఈ ప్రాంతంలో జంతువుల నుంచి భక్తులను రక్షించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యే క సదుపాయాలు కల్పిస్తారు. సుమారు 12-18గంటల సమయం పట్టే ఈయాత్రలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా భక్తులు తమ జాగ్రత్త కోసం చేతి కర్రను, టార్చిలైట్ను, అల్పాహారాన్ని అందుబాటులోకి ఉంచుకుంటే మంచిది. నడక మార్గంలోకి జంతువులు రాకుండా బాంబులతో శబ్ధాలు చేస్తూంటారు. స్వామివారిని సులభంగా దర్శించుకోవాలనుకునేవారు పంబా నది దగ్గరలోని కన్నిమూల గణపతి ఆలయం నుంచి కాలినడక ప్రారంభిస్తారు. దీనిని చిన్నపాదం అంటారు. చిన్నపాదం నిటారుగా ఉంటుంది. పెద్ద పాదం నడవలేనివారు చిన్నపాదం ద్వారా అయ్యప్ప సన్నిధానం చేరుకుంటారు. చిన్నపాదం నిడివి 11కి.మీ. నడవలేని భక్తుల కోసం ‘డోలి’ సౌకర్యం నిర్ణీతమైన రుసుముతో అందుబాటులో ఉంటుంది. సన్నిధానంలోకి వెళ్లిన తరువాత బంగారు 18మెట్లు ఎక్కి హరిహరసుతుడైన అయ్యప్పను దర్శించుకుని దివ్యానుభూతికి లోనవుతారు.
ఎరుమేలి నుంచి కాలి నడకన…
ఎరుమేలి చేరుకున్నాక అక్కడి కోనేరులో తలస్నానం చేసి పేటతుైళ్లె నృత్యాలు చేస్తూ, విచిత్ర వేషధారణాలతో రంగులు చల్లుకుంటూనృత్యాలు చేస్తూ వెళ్తారు. ఎరుమేలి నుంచి కాలి నడకన పెద్దపాదం ద్వారా అలుదా నది, అలుదా కొండలు దాటి పంపానది చేరుకొని స్నానాలు ఆచరిస్తారు. అక్కడ గల శరణు గుత్తి చేరుకొని చెట్టుకు బాణాన్ని గుచ్చుతారు. కన్నిమూల గణపతిని దర్శించుకొని శబరికొండకు పయనమవుతారు.
పెద్దపాదం, చిన్నపాదం…
పెద్దపాదం సుమారు 60 కిలో మీటర్లు దట్టమైన అడవి ప్రాం తం. కన్నిమూల గణపతి నుం చి చిన్నపాదం మొదలవుతుం ది. చిన్నపాదం నిటారుగా ఉం టుంది. పెద్దపాదం నడవలేని వారు చిన్నపాదం ద్వారా అయ్యప్ప సన్నిధానం చేరుకుంటారు. చిన్నపాదం 11 కిలో మీటర్లు ఉంటుంది. సన్నిధానంలోకి వెళ్లిన తరువాత బంగారు 18 మెట్లు ఎక్కి హరిహర సుతుడైన అయ్యప్పను దర్శించుకొని దివ్యమైన అనుభూతికి లోనవుతారు.
నియమాల మాల..
విశిష్టమైన పదునెట్టాంబడి (18మెట్లు)…
శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ఉండే 18మెట్లను పరశురాముడు నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. మనిషిలోని 18 రకాల చెడు గుణాలు తొలగిపోవడానికి దీక్షలో పడిపూజ (మెట్టు పూజ) నిర్వహిస్తారు. అయ్యప్ప మాలను ధరించిన ప్రతీసారి చెడు లక్షణాలను విడిచిపెట్టి మంచి వారీగా మారాలని కోరుకుంటూ ఈ పూజను నిర్వహిస్తారని గురుస్వాములు చెప్తుంటారు.