సత్తుపల్లి టౌన్, ఆగస్టు 19: సత్తుపల్లి ప్రాంతంలో ప్రజాప్రయోజనాలు, భవిష్యత్ అవసరాల కోసం శనివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమక్షంలో జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్ధ విక్రమ్సింగ్, కల్లూరు ఆర్డీవో అశోక చక్రవర్తి, సింగరేణి పీవో వెంకటాచారి, శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుజాత కలిసి క్షేత్రస్థాయిలో అటవీభూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఖాళీగా ఉన్న స్థలాన్ని ఆసుపత్రి భవిష్యత్ అవసరాల మేరకు కేటాయించాలని కోరారు. విరాట్నగర్, ద్వారకాపురి కాలనీ ప్రాంతాల్లో జామాయిల్ ప్లాంటేషన్లో పెద్ద పెద్ద వృక్షాలు గాలులకు కూలి ఇళ్లపై పడుతున్నందున వాటిని తొలగించి అటవీశాఖ స్థలం వరకు బోర్డర్ ఏర్పాటు చేయాలని సూచించారు. దుర్గంధంగా ఉన్న ఎన్టీఆర్ పాత కాలువను పూడ్చివేయాలని, దానిని ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉపయోగించేలా సహకరించాలని కోరారు. రూ.5 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న మినీ స్టేడియానికి స్థానిక జ్యోతినిలయానికి ఆనుకుని ఉన్న భూమిని అప్పగించాలన్నారు. అటవీశాఖ బౌండరీల్లో తాటి, ఈతచెట్లు నాటేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. అనంతరం సింగరేణి అతిథిగృహంలో మున్సిపల్ చైర్మన్ మహేశ్, కల్లూరు ఆర్డీవో అశోకచక్రవర్తి, సత్తుపల్లి ఎఫ్డీవో మంజుల, ఐబీ ఈఈ శ్రీనివాసరెడ్డి, సీఈ మరియన్న, జేవీఆర్ ఓసీ పీవో వెంకటాచారి, తహసీల్దార్ యోగేశ్వరరావు, సత్తుపల్లి రేంజర్ వెంకటేశ్వర్లు, కమిషనర్ సుజాతలతో డీఎఫ్వో, ఎమ్మెల్యే సమావేశమయ్యారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజా అవసరాల కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే విలేకరులకు తెలిపారు.