కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 25: కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసమే నిరంతరం పాటుపడుతున్నామని, ఇందులో భాగంగా క్రీడలకూ పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని 6, 27 వార్డుల్లో సుమారు రూ.70 లక్షలతో నిర్మించిన వనమా పార్కు, ప్రగతి మైదానంలో బాస్కెట్బాల్ కోర్టు, రాజీవ్పార్కులో మినీ ఫుట్బాల్ కోర్టులను శనివారం ఆయన ప్రారంభించారు. 27వ వార్డులో క్రీడా కోర్టును ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు ఇటీవల సీఎం కేసీఆర్ రూ.220 కోట్లను మంజూరు చేశారని, ఆ నిధులతో ఈ రెండు మున్సిపాలిటీలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి పనులు తదితర అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఆ పనులకు కూడా శంకుస్థాపన చేసి త్వరితగతిన పనులను పూర్తయ్యే విధంగా కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, క్రీడాకారులకు అవసరమైన కోచింగ్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా శిక్షకులను కూడా ఏర్పాటు చేస్తోందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు జక్కం రమేశ్, కాపు సీతాలక్ష్మి, దామోదర్, రఘు, ధర్మరాజు, ప్రసాద్, రజాక్, వెంకట్, కాపు కృష్ణ పాల్గొన్నారు.