ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 22: ఆంధ్రప్రదేశ్కు చెందిన వివాదాస్పద రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ది సుపారీ హత్య అని పోలీసులు తేల్చారు. వ్యాపార లావాదేవీల విషయంలో అతడి స్నేహితుడే అతణ్ని హత్య చేయించాడని, ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని కారులో ఉంచి ఆ కారును పాలేరు జలాశయంలో తోసేశారని వారి దర్యాప్తులో నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆయన కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని నంధ్యాల జిల్లా నందికొట్కూరు గ్రామానికి చెందిన బొగ్గుల శ్రీనివాస్ (48) అనే వ్యక్తి రచయిత. కొంతకాలంగా యూట్యూబర్గా పనిచేస్తూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. అయితే, ఏపీ డిప్యూటీ సీఎంపై ఇటీవల అతడు చేసిన రచనలు, తీసిన యూట్యూబ్ వీడియోలు వివాదాస్పదమైన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ నెల 14న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో ఓ కారు పడగా.. అందులో బొగ్గుల శ్రీనివాస్ మృతదేహాన్ని కూసుమంచి పోలీసులు గుర్తించారు. అతడిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బొగ్గుల శ్రీనివాస్ తన ఏరియాలో కొంతకాలం క్రితం జరిగిన తమ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరయ్యాడు.
అక్కడ మేకల వేణుమాధవ్ అనే పూర్వ విద్యార్థి పరిచయమయ్యాడు. శ్రీనివాస్ పేరుమీద ఉన్న జీఎస్టీ లైసెన్స్తో ‘వేణుమాధవ్ మేకా ప్రాజెక్ట్స్’ అనే కంపెనీని వేణుమాధవ్ పెట్టాడు. అతడే సబ్ కాంట్రాక్టర్గా వ్యవహరిస్తూ పనులు చేస్తున్నాడు. తన లైసెన్స్ ఉపయోగించుకుంటున్నందుకు గాను తనకు 50 శాతం ప్రాఫిట్ ఇవ్వాలని శ్రీనివాస్ కోరాడు. అందుకు వేణుమాధవ్ కూడా సమ్మతించాడు. 2022 – 25 కాలంలో రూ.90 లక్షల ప్రాఫిట్ వచ్చింది. వారి ఒప్పందంలో భాగంగా అందులో రూ.45 లక్షలను శ్రీనివాస్కు వేణుమాధవ్ ఇవ్వాల్సి ఉంది. కానీ, రూ.15 లక్షలను శ్రీనివాస్కు ఇచ్చిన వేణుమాధవ్.. మిగిలిన రూ.30 లక్షలను త్వరలో ఇస్తానని చెప్పాడు. ఈలోగా జీఎస్టీ శాఖ నుంచి శ్రీనివాస్కు నోటీసులొచ్చాయి. దీంతో అప్రమత్తమైన శ్రీనివాస్.. తనకు రావాల్సిన రూ.30 లక్షల బకాయిని ఇవ్వాలని, జీఎస్టీ లైసెన్స్ను యాక్టివ్ చేసి ఇవ్వాలని వేణుమాధవ్పై ఒత్తిడి చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో శ్రీనివాస్ను అంతమొందించేందుకు వేణుమాధవ్ ప్లాన్ చేశాడు.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటకు చెందిన పోకల కోటేశ్వరరావు, షేక్ అబ్జుల్ హఫీజ్, ఎండీ అజ్మత్ అలీలకు రూ.5 లక్షల సుపారీ ఇచ్చాడు. ప్లాన్లో భాగంగా ఈ నెల 13న వారితో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. విజయవాడ వెళ్దామంటూ శ్రీనివాస్ను ఒప్పించారు. సుపారీ తీసుకున్న ముగ్గురు, వేణుమాధవ్, శ్రీనివాస్ కలిసి కారులో అదే రోజు రాత్రి బయలుదేరారు. నకిరేకల్ సమీపంలోకి వచ్చాక జనసంచారం లేని ప్రదేశం చూసి కారులోనే నిందితులంతా కలిసి కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేసి శ్రీనివాస్ను హత్య చేశారు. అతడు ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరించాలనుకున్నారు. అక్కడి నుంచి అదే కారులో ఆ మరుసటి రోజు (ఈ నెల 14న) తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కూసుమంచి పాలేరు జలాశయం వద్దకు వచ్చారు.
శ్రీనివాస్ మృతదేహాన్ని కారులో ఉంచి ఆ కారును పాలేరు జలాశయంలో తోసేసి వెళ్లిపోయారు. అయితే, అదే రోజు పాలేరు జలాశయంలో కారును గుర్తించిన కూసుమంచి పోలీసులు దానిని బయటకు తీశారు. అందులో శ్రీనివాస్ మృతదేహం ఉండడం, అతడి మృతదేహంపై గాయాలు ఉండడం వంటి కారణాలతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వారి దర్యాప్తులో శ్రీనివాస్ను వేణుమాధవే హత్య చేయించినట్లు తేలింది. కాగా, ఈ కేసు ఛేదనలో అత్యంత ప్రతిభ కనబర్చిన కూసుమంచి సీఐ సంజీవ్, ఎస్సై నాగరాజు, నేలకొండపల్లి, తిరుమలయపాలెం ఎస్సైలు జగదీష్, సంతోశ్, దివ్యలను ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఈ కేసులో సాంకేతిక సహకారం అందించిన శ్రీకాంత్, సతీశ్, వినయ్, ఉదయ్, పూర్ణచందర్రావు, శైలజ, సయ్యద్, శోభన్, సీతారాములు, రాంబాబులను ఏసీపీ అభినందించారు.