భద్రాచలం, జూన్ 17: తెలంగాణలో సీఎం కేసీఆర్ తెచ్చిన పాలనా సంస్కరణలు అద్భుతమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, తండాలను పంచాయతీలుగా చేయడం గొప్ప విషయమని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాకే మారుమూల గిరిజన గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకోగలిగామని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గిరిజన దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలనలో ఆదివాసీ గూడేలకు, గిరిజన తండాలకు కనీస సౌకర్యాలు అందేవి కావని, విద్య, వైద్యం వంటి అందని ద్రాక్షలా ఉండేవని గుర్తుచేశారు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక గూడేలు, తండాల అభివృద్ధికి పెద్దపీట వేశారని వివరించారు. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో గిరిజనులకు అమలవుతున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోని గిరిజనులకూ అందడం లేదని వివరించారు.
తండాల్లోనూ ప్రతి ఇంటికీ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి ఏజెన్సీకి మెరుగైన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చిన ఘతన సీఎం కేసీఆర్నని అన్నారు. తండాల్లోనూ పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లాలో 50 వేల ఎకరాలకు త్వరలోనే పోడు పట్టాల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. దుమ్ముగూడెంలోని ఏజన్సీ గ్రామంలో 250 నివాసాలకు బోర్వెల్, త్రీఫేజ్ కరెంట్, రోడ్లు వంటి సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ధరణిలో ఉన్న సమస్యలను పూర్తి చేసి అశ్వారావుపేటలో 900 మంది రైతులకు అసైన్మెంట్ పట్టాలు అందించినట్లు వివరించారు.
కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా ఏర్పాటుతో ఏజెన్సీ గిరిజనులకు పరిపాలనా సౌలభ్యం చేరువైందని అన్నారు. ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలుతో గిరిజనుల జీవితాలతో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, డీఎఫ్వో రంజిత్నాయక్, ఏపీవో జనరల్ డేవిడ్రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ తదితరులు పాల్గొన్నారు.