వైరా టౌన్, నవంబర్ 9: రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని, అభివృద్ధికి చిరునామాగా తెలంగాణ నిలుస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు కరెంటు కష్టాలు తప్పాయని గుర్తుచేశారు. విద్యుత్ కర్మాగారాలు నిర్మించి ప్రజలకు నిరంతర విద్యుత్ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. బీఆర్ఎస్ వైరా అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా వైరాలో పట్టణంలో గురువారం నిర్వహించిన సభలో బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోతు మదన్లాల్, ఎమ్మెల్యే రాములునాయక్తో కలిసి ఆయన మాట్లాడారు. వైరా నియోజకవర్గంలో మదన్లాల్, రాములునాయక్ కలిసి జొడెడ్లుగా పనిచేస్తున్నారని అన్నారు. వీరి కృషితో వైరా నియోజకవర్గం అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ నియోజకవర్గం ఇంతకు ముందుకు ఎలా ఉండేదో, ఇప్పుడు ఎంతటి అభివృద్ధిని సాధించిందో ప్రజలు గమనించాలని కోరారు. మదన్లాల్ను గెలిపించుకుంటే మరింత అభివృద్ధికి ఢోకా లేదని స్పష్టం చేశారు.
ఈ నెల ౩౦న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి మదన్లాల్ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి మదన్లాల్ మాట్లాడుతూ.. కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ మదన్లాల్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు చేసిన మదన్లాల్ : బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థిగా బానోతు మదన్లాల్ గురువారం వైరాలో నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్తో కలిసి వైరాలోని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. రిటర్నింగ్ అధికారి బీ.సత్యప్రసాద్కు మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు.