ఖమ్మం, డిసెంబర్ 21: రాష్ర్టాల్లో చిన్న పరిశ్రమలను కాపాడాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. ఇప్పటికే మూతపడిన వాటిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన ఐదేళ్లలో పలు రాష్ర్టాల్లోని కొన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వివిధ కారణాలతో మూతపడిన అంశంపై గురువారం ఆయన పార్లమెంటులో మాట్లాడారు. దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ని పరిశ్రమలు ఎందుకు మూతపడ్డాయో ప్రధాన కారణాలను చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇలా పరిశ్రమలు మూతపడడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతిని నిరుద్యోగిత మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మూతపడిన పరిశ్రమలను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి భాను ప్రతాప్సింగ్ వర్మ సమాధానమిస్తూ.. గడిచిన ఐదేళ్లలో 32,754 మంది తమ వ్యాపారాలను రద్దు చేసుకోగా.. ఈ ఐదేళ్ల కాలంలో ఈ నెల 15 వరకు రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా 1,21,11,249 మంది కొత్తగా వ్యాపారాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. చిన్న వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలను అందిస్తోందని, వ్యాపారాభివృద్ధికి సహకరిస్తోందని అన్నారు.