బోనకల్లు, ఏప్రిల్ 3: కాంగ్రెస్వి ఎప్పుడూ మాయమాటలేనని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రజలకు ఇవే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ పాలనను చూసి ప్రజలు కూడా పునరాలోచిస్తున్నారని అన్నారు. బోనకల్లు మండలం జానకీపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన పార్లమెంటు ఎన్నికల పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆరు గ్యారెంటీలంటూ చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణ నుంచి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజల సమస్యలపై ఏనాడూ పార్లమెంట్లో మాట్లాడిన సందర్భాలు లేవని విమర్శించారు. కేవలం తాను ఒక్కడినే అనేక సమస్యలపై మాట్లాడానని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించానని గుర్తుచేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, గిరిజన యూనివర్సిటీ, అండర్ బ్రిడ్జిలు, ఓవర్బ్రిడ్జీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసేందుకు ఎంతగానో కృషి చేశానన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తాను అధిక మెజార్టీతో గెలుపొందానని గుర్తుచేశారు. మరోసారి కూడా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను కార్యకర్తలు, ప్రజలు అద్భుత మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, అంతకుమునుపు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో వేర్వేరు పార్టీలు గెలిచినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టారని గుర్తుచేశారు. అందుకని ఈ సారి కూడా ప్రతి కార్యకర్తా పార్టీ అభ్యర్థిగా భావించి కష్టపడి పనిచేయాలని, ఖమ్మం పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ను గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి మొట్టమొదటిసారిగా గెలిచే సీటు ఖమ్మమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో ప్రయోజనం కలుగుతుందని ప్రజలు కూడా అనుకున్నారని అన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చాక ఏ ప్రయోజనమూ లేకపోయిందని అన్నారు. దీంతో తాము మోసపోయినట్లుగా ప్రజలు కూడా బాధపడుతున్నారని అన్నారు. అందుకని ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా గెలుపు ఎంతో అవసరమని అన్నారు.
ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఏ పార్టీకైనా గెలుపోటములు సహజమని అన్నారు. గత పదేళ్లలో తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కూడా అహర్నిశలూ శ్రమించి తెలంగాణను దేశంలోనే ముందు వరుసలో నిలిపారని జ్ఞప్తికి తెచ్చారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచేది బీఆర్ఎస్ పార్టయేనని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చే వారు వస్తుంటారని, పోయేవారు పోతుంటారని అన్నారు. వాళ్లను చూసి కార్యకర్తలు అధైర్యపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతిభవన్లో బంగారు బాత్రూంలు కట్టించారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారని అన్నారు. మరి అదే ప్రగతిభవన్లో ఇప్పుడు ఇక్కడి ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం భట్టి నివాసం ఉంటున్నారని అన్నారు. మరి ప్రగతిభవన్లో బంగారు బాత్రూంలు ఉన్నాయో లేవో అనే విషయం వారికే తెలియాలని విమర్శించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. అందరమూ కలిసికట్టుగా పనిచేసి నామా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, చేబ్రోలు మల్లికార్జున్, బంధం శ్రీనివాసరావు, బాణోతు కొండా, మోదుగుల నాగేశ్వరరావు, జంగా రవికుమార్, వేమూరి ప్రసాద్, గద్దల వెంకటేశ్వర్లు, కాకాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.